అయ్యన్న అరెస్టు అందుకే-ఏపీసీఐడీ వివరణ-కాసేపట్లో కోర్టుకు-టీడీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
ఏపీలో టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు ఈ తెల్లవారు జామున అరెస్టు చేశారు. రెండెకరాల భూమిని ఆక్రమించేందుకు ఎన్ఓసీ పత్రాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఆయనతో పాటు కుమారుడు రాజేష్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను కాసేపట్లో కోర్టులో హాజరుపర్చబోతున్నారు. అదే సమయంలో అరెస్టు సందర్భంగా సీఐడీ వ్యవహరించిన తీరుపై టీడీపీ నిరసనలకు దిగింది.
అయ్యన్న అరెస్టుపై సీఐడీ ప్రకటన
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని తన ఇంటి వెనుక రెండెకరాల స్ధలం ఆక్రమించేందుకు అధికారులు ఎన్ఓసీ ఇచ్చినట్లు పత్రాలు ఫోర్జరీ చేసిన వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడని సీఐడీ ఇవాళ అరెస్టు చేసింది.ఆయనతో పాటు కుమారుడు రాజేష్ ను కూడా అరెస్టు చేసింది. దీనిపై మంగళగిరిలోని సీఐడీ ఆఫీసులో అధికారులు వివరణ ఇచ్చారు. పత్రాలు ఫోర్జరీ చేసి రెండెకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో ఆధారాలు ఉన్నందున చట్టబద్ధంగానే వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు సీఐడీ ప్రకటించింది.
దురుసు ప్రవర్తనపై సీఐడీ
అర్ధరాత్రి రెండుగంటల సమయంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ ను సీఐడీ దాదాపు 200 మంది పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తాయి. అలాగే అరెస్టు సమయంలో సీఐడీ వ్యవహారశైలిని అయ్యన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపైనా వివరణ ఇచ్చింది. నిందితుడు అరెస్టుకు సహకరించకపోతే బలవంతంగా తీసుకెళ్లొచ్చని నిబంధనలు చెబుతున్నాయని అధికారులు వివరణ ఇచ్చారు.
అయ్యన్న అరెస్టుపై భగ్గుమన్న టీడీపీ
అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ ను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన తీరుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలు నిరసనలకు దిగాయి. సీఐడీ తీరుపై విమర్శలు గుప్పించాయి. హైకోర్టు ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నా సీఐడీ వ్యవహారశైలి మారడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అటు రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ మాజీ మంత్రులు అయ్యన్న అరెస్టును ఖండించారు.
సీఐడీ కోర్టుకు అయన్న-హైకోర్టుకు కుటుంబం ?
అయ్యన్నపాత్రుడుని, కుమారుడు రాజేష్ ను ఫోర్జరీ కేసులో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు మధ్యాహ్నం సీఐడీ కోర్టులో హాజరు పరిచేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ సీఐడీ కార్యాలయంలోనే ఉన్న వీరిద్దరినీ అక్కడి సీఐడీ కోర్టులోనే హాజరుపర్చబోతున్నారు. మరోవైపు అయన్నపాత్రుడు అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. అరెస్టు సందర్భంగా సీఐడీ వ్యవహారశైలిని తప్పుబడుతూ వారు అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సీఐడీ ఉద్దేశపూర్వకంగానే అయ్యన్నను టార్గెట్ చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.