మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ సోదాలు..!!
మాజీ మంత్రి నారాయణ నివాసంతో పాటుగా ఆయన కుమార్తె నివాసంలో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి.
అమరావతి భూముల వ్యవహారంలో ఏపీ సీఐడీ విచారణ కొనసాగిస్తోంది. మాజీ మంత్రి నారాయణ నివాసంతో పాటుగా ఆయన కుమార్తె నివాసంలో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి లో జరిగిన భూ స్కాంకు సంబంధించి సీఐడీ విచారణ చేస్తోంది. అందులో భాగంగా నాటి మున్సిపల్ మంత్రిగా అమరావతి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన నారాయణను సీఐడీ విచారింది. బినామీల పేర్లతో నారాయణ అమరావతిలో భూములు కొనుగోలు చేసారనేది ప్రధాన అభియోగం. ఆ తరువాత పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాల లీకేజ్ విషయంలోనూ సీఐడీ నారాయణను విచారించింది.
ఇప్పుడు హైదరాబాద్ లోని అయిదు ప్రాంతాల్లో సీఐడీ విచారణ కొనసాగుతున్నట్లుగా సమాచారం. అందులో నారాయణ నివాసంతో పాటు ఆయన కుమార్తె ఇంట్లోనూ..అదే విధంగా మరో మూడు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ ,కుకట్ పల్లి, గచ్చిబౌలి లోని నివాసల్లో ఈ సోదాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి పరిధిలోని దాదాపు 140 ఎకరాలకు పైగా భూముల కొనుగోలుకు సంబంధించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. తెలుగు దేశం అధికారంలో ఉన్న సమయంలో అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వైసీపీ నేతల ఆరోపణ. దీని పైన నాటి మంత్రులు..టీడీపీ నేతలు ఏ మేర అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేసిందీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వెల్లడించింది. ఇదే కేసులో సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ కోర్టును ఆశ్రయించారు.

ఇప్పుడు నారాయణతో పాటుగా కుటుంబ సభ్యులకు సంబంధించి సీఐడీ ఆరా తీస్తోంది. ఎవరి పేరుతో భూములు కొన్నారో..వారి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అమరావతిలో లాండ్ స్కాం పైన ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల కమిటీ నియిమించింది. కమిటీ అమరావతిలో అక్రమాలు జరిగాయాని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అమరావతిలో భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీకి ఫిర్యాదులు అందాయి. వీటి ఆధారంగా సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక, ఇప్పడు మాజి మంత్రి నారాయణతో పాటుగా ఆయన కుమార్తె నివాసాల్లో సీఐడీ సోదాలతో కలకలం మొదలైంది. ఇప్పుడు సీఐడీ ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications