ఏపీ మాకు స్పెషల్...అమరావతికి సహకరిస్తాం:సింగపూర్ ప్రభుత్వం హామీ
Recommended Video
అమరావతి:భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తమకు ప్రత్యేకమని సింగపూర్ జాతీయాభివృద్ధి శాఖా మంత్రి వోంగ్లో చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం వోంగ్ లోతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారిరువురు అమరావతితో పాటు అనేక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ''ఇతర దేశాలతో సింగపూర్ సంబంధాలన్నీ ఒక పద్దతి ప్రకారం ఉంటాయి. భారత్ విషయానికి వస్తే అక్కడ ఏపీ అభివృద్ధిలో మేము ప్రత్యేకంగా భాగస్వామ్యం అవుతున్నాం'' అని సిఎం చంద్రబాబుతో వోంగ్లో అన్నారట. అలాగే అమరావతిని ఏదో ఒక పరిపాలనా నగరంగా కాకుండా ఆర్థికాభివృద్ది కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నామని చంద్రబాబు ఆయనకు వివరించారు.
అమరావతికి...సింగపూర్ సహకారం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి నవీన సాంకేతికత, వినూత్న విధానాలను అందించేందుకు తాము సహకరిస్తామని సింగపూర్ మంత్రి వోంగ్ లో హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ సందర్భంగా సింగపూర్ జాతీయాభివృద్ధి మంత్రి వోంగ్లో సూచించారు. ఏపీతో తమ సంబంధాలు దృఢంగా ఉంటాయని, త్వరలో తానే స్వయంగా అమరావతికి వస్తానని వోంగ్లో చెప్పారు.
50 వేల కోట్లు...అవసరం
అమరావతిలో ప్రస్తుతం 3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయని, రూ.30వేల కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టామని చంద్రబాబు సింగపూర్ మంత్రికి తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ అమరావతి అవకాశాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని, ఇది ప్రజా రాజధానిగా ఉంటుందన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు రూ.40 వేల నుంచి 50వేల కోట్లు అవసరమవుతాయని చంద్రబాబు వెల్లడించారు. సింగపూర్-భారత్ మధ్య పరస్పర సహకార సంబంధాలకు ఇదో మంచి అవకాశమని...అమరావతిని ప్రపంచంలో ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలపాలనేది తమ ప్రయత్నమని చంద్రబాబు వివరించారు.
నగరీకరణ...రెండంకెల సుస్థిర వృద్ధి
సింగపూర్లో జరుగుతున్న ‘ప్రపంచ నగరాల సదస్సు - మేయర్ల ఫోరం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. నగరీకరణే విజన్గా ఆంధ్రప్రదేశ్ను 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ గమ్యస్థానంగా మారుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. విభజన తర్వాత తలెత్తిన సమస్యలను అధిగమించి రెండంకెల సుస్థిర వృద్ధిని కొనసాగించేందుకు కృషిచేస్తున్నామన్నారు. జల వననరుల నిర్వహణ -స్మార్ట్ టెక్నాలజీ అంశాలపై ఏపీకి సహకరిస్తామని ఈ సందర్భంగా సింగపూర్ మేయర్ల కమిటీ చైర్మన్ లింగ్ హామీ ఇచ్చారు. నగరాలను మెరుగుపరచడం, అభివృద్ధిలో భాగస్వామ్యాలను అందిపుచ్చుకోవడం ఎలా అనే విషయాలపై సదస్సులో చర్చ జరిగింది.
చంద్రబాబుతో...భారత రాయబారి భేటీ
ఎపి సీఎం చంద్రబాబుతో సింగపూర్లోని భారత సీనియర్ రాయబారి గోపీనాథ్ పిళ్లై భేటీ అయ్యా రు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉభయ దేశాల సంబంధాలతో సహా వివిధ అంశాలపై సమీక్షలు చేస్తున్నామని పిళ్లై చెప్పారు. దీనివలన తదుపరి దశలో పెట్టుబడుల ఆకర్షణకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఏపీలో వ్యవసాయం, వ్య వసాయ ఆధారిత పరిశ్రమలు విజయవంతంగా నడిస్తే అది రైతాంగానికి బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ దిగుబడుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని గోపీనాథ్ పిళ్లై కు చంద్రబాబు వివరించారు.