సిఎం నోట మరోసారి నిరాహారదీక్ష హెచ్చరిక..ఎందుకిలా?..సామాన్యుడి సందేహం...
మొన్నకలెక్టర్లకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానన్నారు...నిన్నఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేస్తానన్నారు...మరి రేపు...ప్రజలకు వ్యతిరేకంగా చేస్తానంటారేమో నిరాహారదీక్ష...సాక్షాత్తూ ముఖ్యమంత్రి అయి ఉండి చంద్రబాబు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో, ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలో తెలీక జనం జుట్టు పీక్కుంటున్నారు.
ముఖ్యమంత్రి చెబితే కలెక్టర్లు, ఎమ్మెల్యేలే కాదు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో సహా సకల జనాంగమూ మాట వినాల్సిందే. ఛీప్ సెక్రటరీ నుంచి వాచ్ మెన్ వరకు...ఉప ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా అందరికీ సిఎం అదేశాలు శిరసావహించడం తప్ప మరో దారి లేదు. అలాంటిది అటు కలెక్టర్లు...ఇటు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట వినటం లేదంటే ఏమిటి అర్ధం?...చంద్రబాబు ఆదేశాలను, ఆయన హెచ్చరికలను వాళ్లు ఏమాత్రం లెక్క చేయటం లేదనే అర్ధం వస్తుంది. అంటే అటుపాలనపై...ఇటు పార్టీపై తనకు పట్టు తప్పిందని స్వయంగా చంద్రబాబు అంగీకరిస్తున్నట్లే లెక్క.
సిఎం నోట మరోసారి...నిరాహారదీక్ష...
ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలో ఆదివారం టీడీపీ వర్క్షాపు జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక సందర్భంలో... రాష్ట్రవ్యాప్తంగా ఈ మార్చినాటికి అందరికీ మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యం పూర్తికాకుంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానని సీఎం తెలిపారు. నాడు మహాత్మాగాంధీ కూడా ఇదే పని చేశారని, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇంతకంటే మార్గం లేదన్నారు. ఇటీవలే ఒకానొక సందర్భంలో...అవసరమైతే ఒక రోజుల్లా నిరాహార దీక్ష చేసి సమస్య పరిష్కారానికి కలెక్టర్ల పైన తాను పోరాటం చేస్తానని, కలెక్టర్లలో రోషం పెరగటానికే భోజనం మానేసి దీక్ష చేస్తానని సిఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే.
సిఎం గారు...ఇదేం లాజిక్...
ప్రభుత్వం...ముఖ్యమంత్రి తమ మాట వినకపోతే దీక్షలు,ధర్నాలు చేసేది...చేయాల్సింది ప్రతిపక్షాలు...అంతేకాని అధికారపక్షం కాదు...అందులో ముఖ్యమంత్రి అసలే కాదు...అలాంటిది సిఎం చంద్రబాబు ఇలా పదే పదే అధికారులకు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేస్తాననడం ఏమిటి?...తన మాట వినని వారిపై ఎలాంటి చర్య తీసుకునే అధికారం అయినా ముఖ్యమంత్రికి ఉంది...అది చెప్పకుండా ఇలా నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించడం ఏంటో...ఈ లాజిక్ ని ఎలా అర్ధం చేసుకోవాలో సామాన్య జనాలకు ఎవరికీ తెలియడం లేదు.
మహాత్మాగాంధితో పోలిక...ఈ సందర్భంలో సరితూగేనా?
విషయంమరుగుదొడ్లకుసంబంధించిందేకావచ్చు...అంతమాత్రాన సిఎం చంద్రబాబు ఉన్న పరిస్థితులు ఆనాటి మహాత్మాగాంధీ ఉన్న పరిస్థితికి ఏమాత్రం సరితూగవు...ఆయన ఏనాడు ప్రభుత్వ అధినేతగా లేడు...పైగా గాంధీ పోరాడింది బ్రిటీషర్లకు వ్యతిరేకంగా...ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా...అయితే ఇక్కడ చంద్రబాబు తానే పాలకుడిగా ఉన్నారు...ముఖ్యమంత్రిగా తానే ప్రభుత్వాధినేత పాత్ర పోషిస్తున్నారు...తాను దీక్ష చేస్తానంటోంది తన కింద పనిచేసేవారికి వ్యతిరేకంగా...ఆ పరిస్థితికి ...ఈ పరిస్థితికి అసలు సంబంధమూ లేదు...పోలికకు అవకాశమూ లేదు...
సిఎం చంద్రబాబు...ఎందుకిలా మాట్లాడుతున్నారు...
మరయితే చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉందని సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ... అధికారులను...ప్రజాప్రతినిథులను నేరుగా హెచ్చరించి నొప్పించడం ఇష్టం లేక చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమోనని విశ్లేషించుకుంటున్నారు...అయితే సిఎం నేరుగా చెబితేనే అర్థం చేసుకోలేని వారికి...ఇలా హెచ్చరించడం వల్ల ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు ఎలా భావిస్తున్నారా అని తర్కించుకుంటున్నారు.
నిరాహార దీక్ష చెయ్యాలన్నా...సాధ్యమేనా...
మార్చి31 తర్వాత కూడా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు రానీ గ్రామాలను గుర్తిస్తామని, అప్పుడు ప్రతీ గ్రామానికి వెళ్ళి మరుగుదొడ్లు నిర్మించుకునే వరకూ అక్కడే మకాం వేస్తానని కలెక్టర్లకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించే సందర్భంలో సిఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఏడు జిల్లాల్లోని కొన్ని వేల గ్రామాల్లో నేటికి మరుగుదొడ్లు నిర్మాణం జరగలేదు. ప్రతీ ఇంటిలో ఫోన్లు ఉంటున్నాయి కానీ మరుగుదొడ్లు మాత్రం కనిపించటం లేదని ముఖ్యమంత్రే చెబుతుండటం గమనార్హం. మరి ఎన్ని గ్రామాలకని చంద్రబాబు వెళతారు...అసలు అది సాధ్యమేనా...కానప్పుడు ఎందుకిలా?...కేంద్రనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళతానన్నతన వ్యాఖ్యలపై వేరే అర్ధం వచ్చిందని భావించి తన మాటల వెనుక భావాన్నివివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...అలా ఈ నిరాహార దీక్షల హెచ్చరికల వెనుక మర్మం ఏమిటో ఆయనే మరో సందర్భంలో చెబితే తప్ప అర్థం కాదని సామాన్యులు సమాధానపడుతున్నారు.