మనసు ఉప్పొంగింది.. బర్త్ డే గ్రీటింగ్స్ పై చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వజ్రోత్సవ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కుటుంబంతో సహా యూరప్ వెళ్లి మరీ చంద్రబాబు తన పుట్టినరోజును విన్నూత్నంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేబినెట్ సహచరులతో పాటు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పొరుగు రాష్ట్రాల రాజకీయ నేతలు చంద్రబాబుకు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలిపారు. వీటిపై చంద్రబాబు స్పందించారు.
నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగిందంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అన్నారు. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో తనకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం, అపురూప అవకాశం అన్నారు.

మీ ఆదరాభిమానాలు, నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయని చంద్రబాబు తెలిపారు. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారన్నారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నట్లు చెప్పారు.
స్వర్ణాంధ్ర-2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం అని చంద్రబాబు తెలిపారు. మీ మద్దతుతో, మీ సహకారంతో, సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తానన్నారు. నా ప్రతీ అడుగు, నా ప్రతీ ఆలోచన, ప్రతీ కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే అన్నారు. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ ఆవిష్కరణలకు , అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది తన తపన అన్నారు. 'థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ' విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందామని తెలిపారు.
సమాజంలో అసమానతలు పోవాలని, పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే తన సంకల్పం అన్నారు. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మూడు దశాబ్దాల నాడు తాను ప్రవేశపెట్టిన 'జన్మభూమి' సమాజంలో ఎంతో మార్పుతెచ్చిందన్నారు. ఈసారి తీసుకువచ్చిన 'పీ4'తో రాష్ట్రంలో పేద కుటుంబాలను, స్వర్ణ కుటుంబాలుగా చేయాలనేది తన ప్రయత్నం అన్నారు. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలని, వ్యక్తి శ్రేయస్సే... సమాజ శ్రేయస్సుగా తాను విశ్వసిస్తానని చంద్రబాబు తెలిపారు. జనం మన బలం, జనాభా సమర్ధ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చన్నారు.
నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.
— N Chandrababu Naidu (@ncbn) April 20, 2025
75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, నన్ను ముందుకు…
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని, అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందువరుసన ఉన్నామని చంద్రబాబు తెలిపారు. మనం కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని తిరుగులేని విజయాలు సాధించగలమన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే తన అభిలాష అన్నారు.
ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉందని, దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు, తనతో పాటు, అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ, విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పారు.












Click it and Unblock the Notifications