50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. రూ.810 కోట్లతో!
ఏపీలోని కూటమి సర్కారు పారిశ్రామిక రంగంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 50 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. కాగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెడఈర్లపాడు నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి.
రూ.810 కోట్ల పెట్టుబడులతో..
ఈ 50 పార్కులు మొత్తం 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేయబడుతున్నాయి. వీటి ద్వారా సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ కార్యక్రమం రాష్ట్ర పారిశ్రామిక పునరుజ్జీవనానికి దోహదం చేస్తుందని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొన్నారు.

రెండో దశలో..
అలానే ప్రారంభోత్సవాల రెండో దశలో భాగంగా, 329 ఎకరాల్లో రూ.134 కోట్ల వ్యయంతో సిద్ధమైన 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 587 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించనున్న 32 ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్కులు మరియు 3 ప్రైవేటు పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కుల ద్వారా స్థానిక యువతకు పరిశ్రమల రంగంలో కొత్త అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త" కార్యక్రమానికి అనుగుణంగా ఈ పార్కులు ఏర్పాటు అవుతున్నాయి. స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు అవకాశాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం ప్రధాన ఉద్దేశ్యమని పరిశ్రమల శాఖ వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 28 కంపెనీల ఉత్పాదన యూనిట్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మొత్తం రూ.25,696 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థలు తమ యూనిట్లను స్థాపించాయి. వీటిలో ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయలసీమలో 8 కంపెనీలు ఉన్నాయి. అనంతపురం, కాకినాడ, ప్రకాశం, కడప, విజయనగరం, సత్యసాయి, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమయ్యాయి.
సీఎం కనిగిరి పర్యటన షెడ్యూల్..
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఉదయం 10.15 గంటలకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లికి చేరుకుంటారు.
- అక్కడి నుంచి 10.35 గంటలకు వర్చువల్ పద్ధతిలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపడతారు.
- పెడఈర్లపాడులో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన స్వయంగా ప్రారంభించనున్నారు.
- ఆ అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అమరావతికి చేరుకుని, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమవుతారు.
- సాయంత్రం 6.15 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి హాజరవుతారు.












Click it and Unblock the Notifications