ఆదుకోండి: రాజ్నాథ్, జైట్లీతో బాబు, జగన్పై ఫైర్, టిఆర్ఎస్లో విలీనంపై నిరాకరణ
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం వెంటనే సహాయం చేయకపోతే పరిస్థితి విషమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు గురువారం సాయంత్రం ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయటంపై చర్చలు జరిపారు.
విభజన జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్నా కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో ఆర్థిక సహాయం రాలేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విభజనతో ఏపికి జరిగిన అన్యాయం నుండి బయట పడేందుకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. 'ఇటీవల ప్రధానిని కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించాను. ఈరోజు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీని కలిసి మరోసారి పరిస్థితిని వివరించటంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయటం గురించి చర్చించాను' అని చంద్రబాబు చెప్పారు.
కేంద్రం త్వరలోనే ఆశించిన స్థాయిలో సహాయం చేస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి తాను ప్రతి దేశానికి వెళ్లి ఇటుక ఇటుక పేరుస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని నిర్మాణం జరగకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి భూముల విషయంలో జగన్ ఆరోపణలు అవాస్తవమన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపిలో తలసరి ఆదాయం అతి తక్కువ అని, పట్టణ జనాభా కూడా తక్కువగా ఉన్నది కాబట్టే ఆదాయం పెద్దగా లేదని ఆయన చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో ఏపికి ఆర్థిక సహాయం పొందుపరచకపోవటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సహాయం చేయాలని జైట్లీని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును చెల్లించాలని కేంద్రాన్ని కోరామని చంద్రబాబు చెప్పారు. కేంద్ర హోంశాఖ వద్ద ఏపికి సంబంధించిన 16 అంశాలు పెండింగ్లో ఉన్నాయంటూ వీటిని రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసికెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి నూతన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కుల మత కలహాలు సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో టిడిపి శాసనసభ్యులు టిఆర్ఎస్లో విలీనం కావటంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. దీని గురించి న్యాయ నిపుణులతో సంప్రదించవలసి ఉందని చెప్పారు. టిఆర్ఎస్లో టిడిపి ఎమ్మెల్యేల విలీనం చెల్లదని ఆయన అన్నారు.