అమరావతికి రండి: హామీలతో.. బాబు బిజీ, మోడీ ప్రశంస, శంకిచొద్దని వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. దసరా పర్వదినం నాడు అమరావతి శంకుస్థాపన వేడుకకు ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. ఆయన ఉదయం నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఉదయం పన్నెండున్నర గంటల సమయంలో చంద్రబాబు ఏపీ భవన్ చేరుకున్నారు. ఆయనను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. స్వచ్ఛ భారత్ పైన నీతి అయోగ్ నివేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను అమరావతి వేడుకకు ఆహ్వానించారు.

ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. స్వచ్ఛ భారత్ నివేదికను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
స్వచ్ఛ భారత్ నివేదిక అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధఇంచడం కష్టమే కానీ అసాధ్యం కాదని చెప్పారు. అనంతరం ప్రధాని మోడీకి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని అందించారు. రావాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీని, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తును చంద్రబాబు వేర్వేరుగా కలిశారు. వారిని రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. జైట్లీ - బాబు మధ్య పోలవరం, పెండింగ్ అంశాలపై చర్చ జరిగింది. ఏపీని ఆదుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారు. అనంతరం బిజెపి అగ్రనేత అద్వానీని కలుస్తారు.
శంకించొద్దు: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్కు సాయం విషయంలో కేంద్రం చిత్తశుద్ధిని ఎవరూ శంకించవద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం అన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం అందరూ సమష్టి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications