త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి భేటీ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం త్వరలోనే భేటీ కానున్నట్టు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా విభజన సమస్యలు అపరిష్కృతంగా నే ఉండడం వల్ల ఆ సమస్యలను పరిష్కరించడం కోసం రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నట్టు సమాచారం.
తెలుగు రాష్ట్రాల సీఎం లు భేటీ?
అయితే గతేడాది జూలైలో ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చట్టప్రకారం జరగాల్సిన పంపకాల పైన చర్చించారు. మళ్లీ మరోమారు భేటీ కావాలని అప్పుడు నిర్ణయించారు. ఈ క్రమంలోనే అప్పుడు జరిగిన చర్చల తర్వాత వివిధ అంశాలపై చోటు చేసుకున్న పురోగతి ఏమిటి అన్నది తాజాగా జరగనున్న భేటీలో చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాలలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించడం కోసం ఈ భేటీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

త్వరలోనే సమావేశం నిర్వహించాలని యోచన
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సామరస్య పూర్వకంగా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యలు చాలానే ఉన్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే సమావేశాన్ని నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. చట్టప్రకారం జరగాల్సిన పంపకాలు పూర్తి కాకపోవడం పైన ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించారు.
విభజన సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వాల వైఫల్యం
గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలన సాగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నప్పటికీ విభజన అంశాల పైన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలమైన చర్చలు జరిపి ప్రయోజనాలను సాధించలేకపోయాయి. కానీ ప్రస్తుతం ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించడం పైన దృష్టి సారించి భేటీ అవుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలపైన భేటీలో చర్చ
. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్యంగా చోటుచేసుకుంటున్న జల వివాదాల విషయంలో కూడా ఈ భేటీలో చర్చ జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న కృష్ణ, గోదావరి జలాల పంపకాల వివాదం పైన, సాగునీటి ప్రాజెక్టుల పైన కూడా భేటీలో చర్చిస్తారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం జరగనున్న భేటీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ చూపిస్తున్నట్టు సమాచారం.
ఆస్తుల పంపకాల వ్యవహారంపైనా చర్చ
ఉద్యోగుల అంశం, విద్యుత్ బకాయిల అంశం, ఆస్తుల పంపకాలు ఇలా పలు విభజన సమస్యల పైన మరోమారు భేటీ కానున్నారు. అవసరమనుకుంటే కేంద్ర పరిధిలోని అంశాల పైన కూడా చర్చించి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ భేటీకి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు.












Click it and Unblock the Notifications