టీడీపీ-బీజేపీ నేతల వివాదంపై చంద్రబాబు సీరియస్...కమిటీ నియామకం...ఎంతటివారైనా ఉపేక్షించను...
అమరావతి: తాడేపల్లిగూడెంలో టీడీపీ-బీజేపీ నేతల వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. బిజెపి-టిడిపి నేతల విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరుతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
తాడేపల్లిగూడెం జెడ్పీ చైర్మన్ బాపిరాజు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సిఎం చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. అంతేగాక ఇరుపార్టీ నేతల మధ్య నెలకొన్న వివాదంపై టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారట. అనంతరం ఈ వివాదం పై పూర్తి వివరాల కోసం విచారణకు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, వర్మతో చంద్రబాబు ఒక కమిటీ నియమించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఘాటుగా హెచ్చరించారు.
తాడేపల్లిగూడెంలో అభివృద్ది పనులను టిడిపి నేతలు అడ్డుకుంటున్నారంటూ...ఇలాగైతే మగాడిలా రెచ్చిపోతానని మంత్రి మాణిక్యాలరావు తీవ్ర స్థాయిలో స్థానిక నేతలపై విరుచుకుపడగా, ఆ పార్టీ నేతలు కూడా అంతే ఘాటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి మాణిక్యాలరావు గురించి జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ ఆయన సీఎం చంద్రబాబును లేనిపోని మాటలన్నారని, ఏపీనే కట్ చేస్తాననడం మాణిక్యాలరావుకు తగదని బాపిరాజు అన్నారు.
ముందు నోరు జారడం తర్వాత వెనక్కి తగ్గడం మాణిక్యాలరావుకు అలవాటేనని, తన గెలుపు కోసం కృషిచేసిన టీడీపీ కార్యకర్తలను మాణిక్యాలరావు దూరం పెట్టారని ఆయన ఆరోపించారు. అభివృద్ధిలో పోటీకి తనతో మాణిక్యాలరావు సిద్ధమా? అని బాపిరాజు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు పతాకస్థాయికి చేరుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిద్దుబాటు..సర్ధుబాటు...చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది.