స్వామి వారికి పట్టువస్త్రాలు: తిరుమలలో సంతోషంగా చంద్రబాబు
తిరుపతి: ఇక నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రోజునే అమరావతి నుంచి పాలన ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తిరుమలతో పాటు తిరుపతి అభివృద్ధి బాధ్యత కూడా టీటీడీదేనని అన్నారు. బ్రహ్మోత్సవాలకు తిరుపతిని ముస్తాబు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు సోమవారం సాయంత్రం తిరుమలలో ధ్వజరోహనం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొజ్జల, నారాయణ, మాణిక్యాలరావు పాల్గొన్నారు.
అనంతరం టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖమమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.
తొలిరోజైన సోమవారం మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లోనూ తొలివాహన సేవ పెద్ద శేషవాహనంతోనే ప్రారంభమవడం ఆనవాయితీగా వస్తోంది.
Honoured to offer 'Pattu Vastralu' to Lord Venkateswara, starting off the magnificent Brahmotsavams at Tirumala. pic.twitter.com/vTPfWPuf56
— N Chandrababu Naidu (@ncbn) October 3, 2016