బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన సంస్థ.. 4జీ సేవల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు !!
విజయవాడలో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒక శక్తివంతమైన సంస్థగా ఎదిగిందని.. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా నిలుస్తోందని అన్నారు. నడిపించే నాయకుడు లేకపోవడంతో దేశం ఇన్నాళ్లూ అవస్థపడిందని.. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సరైన నాయకుడిగా సరైన స్థానంలో ఉండటంతో టెలికాం రంగం విప్లవాత్మక మార్పులు చూస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
టెలికాం విప్లవం..
1995 నుంచే దేశం టెక్నాలజీ పరంగా, సమాచార సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలన్నది తన కల అని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో టెలికాం రంగంపై తాను సమర్పించిన నివేదికతోనే అనేక సంస్కరణలు జరిగాయని అన్నారు. డీ రెగ్యులేషన్ నిర్ణయం దేశంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిందని వివరించారు. ఈరోజు స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. భారత్ 4జీ స్టాక్ను దేశీయంగా తయారు చేసే అతితక్కువ దేశాల్లో ఒకటిగా నిలిచిందని గర్వంగా తెలిపారు.

ప్రధాని మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో భారతదేశం తయారు చేసిన వ్యాక్సిన్ 100 దేశాలకు చేరి కోట్లాది మందిని రక్షించిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రారంభమైన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ విధానం ఇప్పుడు ఫ్రాన్స్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ఉపయోగిస్తున్నారు అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో తయారైన మొబైల్ ఫోన్లు, యాప్స్, ఉత్పత్తులను ఇప్పుడు ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయని చెప్పారు.
4జీ-5జీ-6జీ: కొత్త దశల ఆవిష్కరణలు
2010లో 4జీ, 2020లో 5జీ వచ్చాయి. ఇక 2030 నాటికి 6జీ కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రతి పదేళ్లకోసారి కొత్త టెక్నాలజీ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1 లక్ష 4జీ సైట్లను ఏర్పాటు చేసి రోజుకు 4 పెటాబైట్ల డేటా అందించడం అభినందనీయమని చంద్రబాబు తెలిపారు. 26,707 మారుమూల గ్రామాలను 4జీ టెక్నాలజీతో అనుసంధానం చేయడం దేశ ప్రగతికి మరో కీలక ముందడుగు" అని వివరించారు.

ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ విప్లవం..
APలో మొబైల్ ఫోన్ ద్వారా 735 పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం అని తెలిపారు. 14.30 లక్షల పైగా డ్వాక్రా గ్రూపుల మహిళలు ఇప్పుడు స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారని, దాంతో వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. "స్మార్ట్ఫోన్ వల్లే నాలెడ్జ్ ఎకానమీ దశలోకి వచ్చాం" అని చంద్రబాబు గర్వంగా చెప్పారు. అంతే కాకుండా దేశంలో ప్రధాని మోదీ క్వాంటమ్ మిషన్ ప్రారంభించారు. తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి 2026 జనవరికి రానుంది. సేఫ్టీ, సెక్యూరిటీ కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యవసరం. అప్పటినుంచి మనం క్వాంటమ్ వ్యాలీని అందుబాటులోకి తెస్తాం" అన్నారు. AI, క్వాంటమ్ టెక్నాలజీలు ఇప్పుడు కలలు కాదు, వాస్తవం అవుతున్నాయని చెప్పారు.
భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతంగా మారుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ యాప్స్ వాడటం ద్వారా 90% డబ్బు విదేశీ కంపెనీలకే వెళ్తోంది. ఈ పరిస్థితి మారాలని.. పేటెంట్స్లోనూ భారత్ నంబర్ వన్గా నిలవాలన్నారు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా మెరుగైన ఆవిష్కరణలు వెలువడాలని కోరుకుంటున్నాం" అని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు 1 బిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారని, ఇది సంస్థ బలాన్ని చాటుతున్నదని అన్నారు. బీఎస్ఎన్ఎల్కి ప్రధానమంత్రి అదనపు నిధులు కేటాయించడం వల్లనే ఈ సంస్థ ఇప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించే స్థాయికి చేరుకుందని చంద్రబాబు వివరించారు.
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4 జీ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/d8yWDhqXfl
— Telugu Desam Party (@JaiTDP) September 27, 2025












Click it and Unblock the Notifications