నువ్వు ఆక్స్ఫర్డ్లో చదివావ్ మరి, హరికృష్ణ చనిపోయినప్పుడు నిజమే: కేసీఆర్కు చంద్రబాబు వార్నింగ్
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు ఏపీ అభివృద్ధి చెందడం ఇష్టం లేదని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. అభివృద్ధిపై 9వ శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో కేసీఆర్, మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్పై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ ఏమైనా ఆక్స్ఫోర్డ్లో చదివారా?
అక్కడ కేసీఆర్ ఏం చెబుతున్నారో, ఇక్కడ జగన్ అదే చేస్తున్నారని విమర్శించారు. వీరు మోడీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జనార్ధన్ రెడ్డి సీఎంగా లేరని గుర్తు చేశారు. తనకు హిందీ, ఇంగ్లీష్ సరిగా రాదని కేసీఆర్ చెప్పడంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఏమైనా ఆక్స్ఫోర్డ్లో చదివారు మరి అని ప్రశ్నించారు. తనకు భాష రాదని అంటున్నారని, ఆయనకు ఏదో భాషొచ్చని ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. తన చేత జైతెలంగాణ అనిపించానని కేసీఆర్ చెబుతున్నారని,. ఆయన అనిపించేది ఏమిటని, విభజిస్తానంటే విభజించండి అని నేనే చెప్పానని అన్నారు. కేసీఆర్ కుతంత్రాలు ఇక్కడ పని చేయవని చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మరింత హుందాగా ఉండాలని హితవు పలికారు.
మోడీ పర్యటనను రద్దు చేసుకున్నారు
జనవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రావాలని ప్లాన్ చేసుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ మేం చచ్చామా బతికామా అని చూసేందుకు వస్తున్నారా అని నేను అడిగానని, ఇప్పుడు ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్ పరుషంగా మాట్లాడినా నేను మాట్లాడనని చెప్పారు. సన్నాసి, మోడీ గాడు, కాంగ్రెస్ ఇడియట్.. అంటూ అభ్యంతరకర పదాలు వాడుతారన్నారు. నేను అలా దిగజారనని చెప్పారు. నీకు నోరుందని తిడితే పడాలా.. సన్నాసి, ఇడియట్ ఏమిటన్నారు. మోడీని అసభ్య పదాలతో దూషిస్తారని, ఇద్దరూ ఇష్టపడి తిట్టుకుంటారని, మళ్లీ ఇద్దరూ ఒకే రూంలో కలిసి కుట్రలో పాలుపంచుకుంటున్నారు.
వైస్రాయ్ సిద్ధాంతకర్త కేసీఆర్
నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉంటే కేసీఆర్ మిడిల్ మోడీ అని, ఏపీలో జగన్ జూనియర్ మోడీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో పదవి కోసం ఆయన పార్టీ పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నానని చెబుతున్నారని, కానీ వైస్రాయ్కు వచ్చిన వారిలో ముందున్నది ఆయనేనని, సిద్ధాంతకర్త కేసీఆరేనని ఎదురుదాడి చేశారు.
హరికృష్ణ చనిపోయినప్పుడు అంతా బహిరంగమే
నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు పొత్తు గురించి అడిగారని చెబుతున్నారని, అందులో రహస్యం ఏమీ లేదని చంద్రబాబు చెప్పారు. ఇద్దరం కలిసి తెలుగు రాష్ట్రాల కోసం పని చేద్దామని, కలుద్దామని, ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం ద్వారా దేశంలో మనం కీలకంగా ఎదుగుదామని చెప్పానని, అది బహిరంగ రహస్యమేనని, అందులో తప్పులేదని చంద్రబాబు చెప్పారు. కానీ ఆ తర్వాత మోడీ వద్దన్నారు, ఆయన (కేసీఆర్) టీడీపీతో కలిసేందుకు నో చెప్పారని తెలిపారు.
కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతానా
తనను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరని, కేసీఆర్ చేస్తే భయపడతానా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను నిప్పులా బతికానని చెప్పారు. ఏమైనా అంటే ఓటుకు నోటు అంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ ప్రస్తావన తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వార్నింగ్ ఇస్తున్నారా అని ప్రశ్నించగా.. నేను వార్నింగ్ ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ ఒక్క కేసు పెడితే నేను నాలుగు కేసులు పెడతానని చెప్పారు. కానీ నేను తప్పు చేయలేదని, నిప్పులా బతికానని చెప్పారు. కేసీఆర్, మోడీ కలిసి దేశాన్ని మోసం చేయాలని చూస్తున్నారన్నారు.
నన్ను మానసికంగా ఎవరూ దెబ్బతీయలేరు
మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, చంద్రబాబు మాట్లాడుతూ.. తనను మానసికంగా ఎవరూ, ఏమీ దెబ్బతీయలేరని చెప్పారు. తనను మానసికంగా దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. తాను ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నానని అన్నారు. ఏపీకి వచ్చి మోడీ, జగన్, కేసీఆర్ కలిసి పోటీ చేయాలని, దాగుడుమూతలు వద్దని, ఇక్కడున్న వారు కేసీఆర్కు కావాలని, మళ్లీ ఆంధ్రవాళ్లను తిట్టాలని, ఇదేం రాజకీయమన్నారు.