టిడిపితోనే ముద్రగడ మంత్రి, కాపులకే కాదు: బాబు, జగన్పై ఆగ్రహం
ఏలూరు: ముద్రగడ పద్మనాభం వంటి ఎందరో కాపు నేతలు టిడిపి ద్వారానే మంత్రులు అయ్యారని, నేతలుగా ఎదిగారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఏలూరులో కాపు రుణమేళాలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన పరోక్షంగా వైసిపి అధినేత జగన్ పైన మండిపడ్డారు.
ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. పేదల వెంటే తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పారు. కాపుల్లో చాలామంది పేదవారు ఉన్నారని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు మంజునాథ కమిషన్ వేశామని, నివేదిక రాగానే అమలు చేస్తామని చెప్పారు.
మంజునాథ కమిషన్లో మరో ముగ్గుర్ని నియమించామని చెప్పారు. కాపు కార్పోరేషన్ రుణాల కోసం మహిళలే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఆర్థిక వెసులుబాటు కోసం మహిళలు రుణాలు కోరుతున్నారన్నారు. పింఛన్ల కోసం రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
దీపం కింద వంట గ్యాస్ కనక్షన్లు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పారు. రూ.24వేల కోట్లతో రుణ విముక్తి పథకం అమలు చేశామన్నారు. నెలనెలా విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇస్తున్నామని చెప్పారు. అన్ని ఇళ్లకు నూటికి నూరు శాతం విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. కోతలు లేకుండా తాము నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు వైసిపి అధినేత జగన్ను ఉద్దేశించి అన్నారు.
గోదావరి జిల్లాల ప్రజలు తుని ఘటన వంటి విధ్వంసానికి పాల్పడరని చెప్పారు. అది కుట్రపూరితంగా జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయన్నారు. చాలా వ్యవస్థలు కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యం అయ్యాయన్నారు.
43.7 లక్షల మందికి రూ.1000 చొప్పున పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. మిగిలిన అగ్రవర్ణాల్లో ఉండే వారికి కూడా తాను హామీ ఇస్తున్ననని.. వారిని కూడా ఆదుకుంటానని చెప్పారు. కొన్ని వర్గాల్లో అంటరానితనం ఉందని, అన్ని వర్గాల్లో పేదరికం ఉందని వాటన్నింటిని రూపుమాపుతానని చెప్పారు.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. నేను కష్టపడితేనే అయిదు కోట్ల మంది ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జనాభా నియంత్రణ చేయాలని నేను పదిహేనేళ్ల క్రితమే చెప్పానన్నారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలన్నారు. టిడిపి వచ్చాకే కాపు నాయకులకు గుర్తింపు వచ్చిందన్నారు. ముద్రగడ పద్మనాభం, కళా వెంకట్రావు సహా చాలామంది కాపు నేతలు టిడిపి హయాంలోనే మంత్రులు అయ్యారన్నారు.
చినరాజప్ప కాపు నేత అని ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. కాపులకు టిడిపి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాపులను చాలామంది నేతలుగా టిడిపి తయారు చేసిందన్నారు. సేవా కార్యక్రమాలు చేసే వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
కాపులలోను పేదరికం లేకుండా చేసేందుకు తాను శ్రీకారం చుట్టానని చెప్పారు. కాపులకే కాదు అగ్రవర్ణాల్లోని పేదలను, బడుగు బలహీన వర్గాలలోని పేదలకు నేను అండగా ఉంటానని చెప్పారు. ఏపీకి చెందిన సత్య నాదెళ్ల ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉన్నారన్నారు. ఆయన వేతనం రూ.500 నుంచి రూ.600 కోట్లు అన్నారు. మనం ఎన్నేళ్లు కష్టపడితో కోటి రూపాయలు వస్తాయన్నారు. అందరు కూడా నైపుణ్యం పెంచుకోవాలన్నారు.