సెల్ఫోన్ ఎంత ముఖ్యమో, మరుగుదొడ్డి అంతే: బాబు
అమరావతి: కడపలో సరికొత్త హంగులతో ఏర్పాటైన విమానాశ్రయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు.
కడప జిల్లాకు గండికోట నీటిని తీసుకొస్తామని చెప్పారు. గాలేరు-నగరి సుజల స్రవంతిని త్వరలో పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ఆశోకగజపతి రాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈరోజు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్రిటిష్ హయాంలో ఇంధనం నింపుకునేందుకు నిర్మించిన ఈ విమానాశ్రయ అభివృద్ధికి దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి చర్యలు చేపట్టినా, ఆయన అకాల మృతితో కడప విమానాశ్రయం పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
ఏడాది క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు విమానాశ్రయ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి విమానాశ్రాయన్ని ఆదివారం ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నాం కడప విమానాశ్రయం నుంచి బెంగుళూరుకు తొలి విమానం బయలుదేరింది. ఈ సందర్భంగా ప్రయాణీకులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కూడా కడప విమానాశ్రయానికి సర్వీస్ని ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కడప విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విమానాశ్రయానికి అన్నమయ్య పేరు పెట్టాలన్న డిమాండ్పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లాలోని ఖాజీపేటలో 'జన్మభూమి-మావూరు' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖాజీపేటలో రూ. 43 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి వాటికి శంకుస్థాపన చేశారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ఫోన్ లేకుంటే మహిళలు అవమానంగా ఫీలవుతున్నారని, సెల్ఫోన్ ఎంత ముఖ్యమో మరుగుదొడ్డి అంతే ముఖ్యమని అన్నారు.
నాగరికతకు మారుపేరు మరుగుదొడ్డి అన్న ఆయన ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉంటాలన్నారు. అదే విధంగా వంటగ్యాస్ కూడా స్పందించారు. వంటగ్యాస్తోనే మీ జీవితాలు బాగుపడతాయన్ని చంద్రబాబు తన హాయంలో దీపం పథకం కింద 33 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చానని చెప్పారు.