అవును, మీ సహకారం కూడా కావాలి: కెసిఆర్ ప్రకటనపై బాబు
విజయవాడ: రెండు రాష్ట్రాలు కలిసి పని చేసుకుందామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపును తాను స్వాగతిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గొడవపడితే వచ్చేదమీ ఉండదని ముందే చెప్పానని వ్యాఖ్యానించారు.
విభజన తర్వాత వచ్చిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. నీటి పంపకాలతో పాటు పలు అంశాల్లో పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు.
విభజన అనంతరం ఆర్థిక లోటు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి అటు తెలంగాణ, ఇటు కేంద్రం నుంచి సహకారం అవసరమని చంద్రబాబు చెప్పారు. దక్షిణ భారత దేశంలో ప్రస్తుతం పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. ఆయన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శనివారం మాట్లాడారు.

కాగా, తెలుగు రాష్ట్రాలు అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుంటూ.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందకు సాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రెండు రోజుల క్రితం అన్నారు. భద్రాచలంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో ఏపీకి సాధ్యమైనంత మేర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఇద్దరికీ నష్టమేనన్నారు. ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు ఏపీ, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు కిందికి వెళ్లిన నీరు తెలంగాణ వాడుకోవడానికి వీళ్లేదని.. ఆ నీటిని ఆంధ్రా ప్రాంతమే వాడుకుంటుందన్నారు.
దుమ్ముగూడెం వద్ద ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తామని తాను శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వెయ్యి టీఎంసీలు వాడుకున్నా ఆంధ్రాకు మరో 1500 టీఎంసీలు ఉంటాయన్నారు. నీటి విషయంలో సమస్యలు రాకుండా పరస్పరం సహకరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనను తాను అంగీకరించినట్లు కేసీఆర్ చెప్పారు. దీనిపై చంద్రబాబు ఆ తర్వాత స్పందించారు.












Click it and Unblock the Notifications