బెజవాడ మధ్యలో ఉందనే: బాబు, నేషనల్ మీడియాకు తన లక్ష్యాలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు, విద్యుత్, భూములు పెట్టుబడులుగా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటామని, కేంద్ర స్థానంలో ఉన్నందునే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఎంపిక చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. ఆయన జాతీయ ఛానళ్లు, పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు.
ఏపీ రాజధాని ఫేస్ 1 నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు. 2019 నాటికి రాజధాని తొలి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. తొలుత ప్రభుత్వ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హంగులు తీసుకు వస్తామన్నారు.
భారత దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖద్వారంగా చేస్తామన్నారు. అందుకే నౌకాశ్రయాల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. త్వరలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 నాటికి ఏపీ దేశంలోనే మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలన్నారు.
2019 నాటికి కరవురహిత రాష్ట్రంగా చేస్తామన్నారు. రాజధానిలో ప్రాధాన్యత అంశాలుగా భవన నిర్మాణాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ప్రయోజనాలు అన్నింటిని తాము ఆధార్కు లింక్ చేస్తామని చెప్పారు. ఆరు నెలల్లో విజయవాడ విమానాశ్రయానికి హంగులు తీసుకు వస్తామన్నారు.