దక్షిణాదిలో బలమైన నాయకత్వం లేకుండా కుట్ర, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు: బాబు సంచలనం
Recommended Video
అమరావతి: దక్షిణాదిలో బలమైన నాయకత్వం లేకుండా చేయాలని బిజెపి నాయకత్వం ప్లాన్ చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.టిడిపిని బలహీనపరిస్తే ఏపీ రాష్ట్రం బలహీనపడుతోందని బిజెపి ఆలోచనగా కన్పిస్తోందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి ఎంపీలతో శుక్రవారం నాడు ఉదయం టెలికాన్పరెన్స్ నిర్వహించారు. కేంద్రంపై అవిశ్వాసం విషయంలో రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు.
ఆరో రోజున కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయమై అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేశారు. పార్లమెంట్లో ఇతర పార్టీలతో సమన్వయం చేసుకోవాలని బాబు సూచించారు.
టిడిపిని బలహీనపర్చే కుట్ర
ఏపీ రాష్ట్రంలో టిడిపిని బలహీనపరిస్తే ఏపీ రాష్ట్రం బలహీనపడుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. టిడిపిని బలహీనపర్చడం వల్ల రాజకీయంగా తమ ప్రయోజనం నెరవేరుతోందని కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయని చంద్రబాబునాయుడు పరోక్షంగా మూడు పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాన్ని కోనసాగించాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు.
దక్షిణాదిలో నాయకత్వాన్ని బలహీనపర్చే కుట్ర
దక్షిణ భారత దేశంలో బలమైన నాయకత్వాన్ని బలహీనపర్చాలని బిజెపి ప్రయత్నం చేస్తోందని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో బిజెపి బలపడాలంటే ఇతర పార్టీలు బలంగా ఉండకూడదనే అభిప్రాయంగా ఆ పార్టీకి ఉందనే పార్టీలతో బాబు టెలికాన్పరెన్స్లో చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం బిజెపికి ఇబ్బందిగా పరిణమించిందన్నారు.సమర్ధ నాయకత్వం లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని చంద్రబాబునాయుడు చెప్పారు.
రాబోయే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి
రాబోయే రోజుల్లో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తున్న విషయాన్ని బాబు గుర్తు చేశారు. పార్టీ ఎంపీలు పార్లమెంట్లో చేస్తున్న పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్నారు. అయితే ఇదే సమయంలో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు.
ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. అంతేకాదు విభజన చట్టంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటన్నింటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు.
ఈశాన్యరాష్ట్రాలకు రూ.5వేల కోట్ల ప్యాకేజీ
ఈశాన్య రాష్ట్రాలకు రూ.5 వేల కోట్ల ప్యాకేజీని ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కానీ, ఏపీ రాష్ట్రానికి ఇస్తానని చెప్పిన హమీలను నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హోదా ఒక్కటే తీసుకోని ప్రోత్సాహకాలను వదిలేయాలని వైసీపీ చూస్తోందన్నారు.తలసరి ఆదాయంలో ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు కేంద్రం సహకరించాల్సిందిగా కోరారు. జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయనేది తనకు బాధను కల్గిస్తోందని చెప్పారు.