ఏపి సీఎం నాలుగు పడవల ప్రయాణం..! తొందరపాటు నిర్ణయాలతో అయోమయం..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అయోమయంలో పడ్డారా..? సమర్ధవంతంగా పాలన అందిస్తానన్న జగన్ తప్పటడుగులు వేస్తున్నారా.? ప్రతిపక్ష పార్టీ పై ఆదిపత్యం కొనసాగించే క్రమంలో అసలు అంశాలు పక్కదోవ పడుతున్నాయా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత, పొరుగు రాష్ట్రంతో స్నేహం, చంద్రబాబుపై పైచేయి, నవరత్నాల అమలు అనే నాలుగు అంశాలతో ఏపి యువ ముఖ్యమంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులను అదిగమిస్తున్నట్టు, పాలన మీద పట్టు సాధిస్తున్నట్టు కనిపిస్తున్నా ఏదో ఒక అవరోధం ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా పరిణమిస్తోంది. దీంతో వైసీపి శ్రేణుల్లో అయోమయం నెలకొన్నట్టు తెలుస్తోంది.
ఏపి సీఎం తొందరపాటు నిర్ణయాలు.. ఇంకా గాడిన పడని పాలన..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి ఏపీని మరింత సమర్థవంతంగా పాలిస్తారని జనం భావించారు. జగన్మోహన్ రెడ్డి పై సానుకూల అభిప్రాయం కంటే చంద్రబాబుపై ప్రతికూల అంశాలు అతన్ని ముఖ్యమంత్రిని చేశాయనేది నిర్విదాంశం. 151 సీట్లు గెలుచుకోవటం రికార్డు గానే చూస్తున్న వైసీపీ శ్రేణులు తమపై జనం ఎంతటి నమ్మకం ఉంచారనే విషయాన్ని పక్కనబెడుతున్నారు. కేవలం బాబుపై కక్షసాధింపుతో తాను పై చేయి సాధించాలనే తపనతో పాలనపై ఏకాగ్రత ఉంచలేకపోతున్నారు. ఇదే అంశం పట్ల అమరావతి వ్యాప్తంగా తారా స్ధాయిలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
లోటు బడ్జెట్ రాష్ట్రం..! ఎటు చూసినా అప్పులే..!!
రాజకీయాల్లో పాలకులు ఇప్పటి వరకూ రెండు పడవల ప్రయాణం చేయటం చూశాం, విన్నాం. కానీ తొలిసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు పడవల ప్రయాణం చేస్తున్నారనే భావన ఏపి ప్రజల్లో బలంగా కలుగుతోంది. ఓ వైపు ఏపీ లో 2024లో గెలవాలనేది వెంటాడుతున్న విషయం. రెండోది తెలంగాణతో సయోధ్య ముఖ్యంగా చంద్రశేఖర్ రావుతో స్నేహం. మూడోది నరేంద్రమోదీతో దోస్తీ, నాలుగోది బాబుపై ప్రతీకారం. వెరసి నలువైపులా తాను చాలా చాకచక్యంగా చక్రం తిప్పగలననే నమ్మకంతో పాటు విజయసాయిరెడ్డి అండ్ బ్యాచ్ ఉందనే భరోసా. కానీ ఇక్కడే జగన్ చాలా కన్ ఫ్యూజన్ కు గురవుతున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ముందుకు కదలని సంక్షేమ పథకాలు..! ఆరోపణలతో వేడెక్కుతున్న రాజకీయం..!!
సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తానంటూ ఎన్నికల ముందుకు పాదయాత్రలో చేసిన హామీలను రేపుమాపంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇసుక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పక్కనబెడితే.. గోదావరి, క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం పార్టీ పరువు తీసేదిగా మారుతుందనే భయం కూడా అధినేతను వెంటాడుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మంగళగిరి, అమరావతి రైతులకు రాజధాని పాతబకాయిలు చెల్లించినా, రాజధాని మార్పు విషయంలో ఇప్పటికీ జగన్ సీఎం హోదాలో స్పష్టత ఇవ్వలేదు. బొత్స మాత్రం ఇది కేవలం కమ్మరావతి అనే ధోరణితోనే విమర్శలు చేస్తున్నారు.
రాజదాని నిర్మాణం..! రాజకీయ దుమారం..! చల్లారేదెప్పుడు..?
కొత్తగా సుజనాచౌదరి వీరులపాడు, చందర్లపాడు మండలాల్లో అంటే సీఆర్ డీఏ పరిధిలో కొనుగోలు చేసిన వందల ఎకరాల బినామీ ఆస్తుల చిట్టా బయటపెట్టాడు. ఇది బీజేపీని కూడా ఇరుకున పెట్టేదిగానే ఉందనేది బహిరంగ రహస్యం. ఆశవర్కర్ల వేతనం, గ్రామ వాలంటరిల నియామక ప్రక్రియ, ప్రభుత్వ మధ్యం దుకాణాలు, సాగునీటి విడుదల లేదంటూ మంత్రుల స్పందన, కోటం రెడ్డి శ్రీధర్చరెడ్డి దుకుడు వ్యవహారం, ఇవన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఇటువంటి సమయంలో నిర్ణయాధికారం ఉన్న జగన్ పుట్టెడు అనుమానాలతో కాలయాపన చేస్తున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అదే నిజమైతే.. మున్ముందు రాజకీయంగా వైసీపీ గ్రాఫ్ మరింత దిగజారే ప్రమాదం ఉందని వైసీపీ అభిమానుల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.