27న సీఎం జగన్ కీలక ప్రకటన..!! ఏ క్షణమైనా సిద్దంగా : సర్వేల్లో తేలిందిదే - వేటు తప్పదు..!!
ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా. సీఎం జగన్ ముందస్తు ఆలోచనల్లో ఉన్నారా. జాతీయ రాజకీయాల్లో ఏపీ ఎన్నికలు ముడి పడిఉన్నాయా. ఈ నెల 27న సీఎం ఏం చెప్పబోతున్నారు. సీఎం జగన్ రూటు మార్చారు. ఇక, మొహమాటాలకు ముగింపు పలికారు. టార్గెట్ 2024 మాత్రమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం..పార్టీలో మార్పులు పూర్తి చేసిన సీఎం జగన్.. ఇక, కార్యాచరణ ప్రకటనకు సిద్దమమ్యారు.
ఇదే సమయంలో జగన్ నిర్ణయాలు...ఆలోచనలు చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అనే చచర్చ మొదలైంది. అందులో భాగంగానే జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నెల 27న సీఎం జగన్ చాలా కాలం తరువాత పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు.
సీఎం జగన్ దిశా నిర్దేశం
అసెంబ్లీ సమావేశాల సమయంలో పార్టీ ఎమ్మెల్సీలు .. ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన సీఎం...ఇప్పుడు పార్టీలో బాధ్యతలు అప్పగించిన నేతలందరితోనూ సమావేశం కానున్నారు. మంత్రులు, రీజనల్ కోర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో పాటుగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సారి దిశా నిర్దేశం మాత్రమే కాకుండా.. బాధ్యతలు ఫిక్స్ చేయనున్నారు. రీజినల్ - జిల్లా అధ్యక్షులుగా నియోజకవర్గాల వారీగా గెలుపు టార్గెట్ నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇదే సమయంలో అసంతృప్తులకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ తరహా రాజకీయాలు వైసీపీలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి. వీటి మీద సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు.
ఇక సీరియస్ నిర్ణయాలే.. గీత దాటితే వేటు
కొందరితో ఇప్పటికే పిలిపించి మాట్లాడారు. మరి కొందరు ఇంకా పరోక్షంగా సమస్యలకు కారణం అవుతున్నారు. పార్టీకి 2024 ఎన్నికల్లో విజయం కీలకమని భావిస్తున్న సమయంలో ఏ విషయంలోనూ ఉదాసీనంగా ఉండేందుకు సిద్దంగా లేననే సంకేతాలు సీఎం స్పష్టంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏ స్థాయిలో వ్యక్తులైనా...వారి కంటే పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పేందుకు రంగం సిద్దమైంది.
అదే సమయంలో 2024 ఎన్నికలకు సమయం అయినా.. ఏ సమయంలో అయినా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయనే విధంగా సీఎం తన కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని..ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
సర్వే నివేదికలు...మార్గదర్శకాలు
ఇక, సంక్షేమ పథకాలు..సీఎం పని తీరు పైన ప్రజల్లో సంతృప్తి ఉందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేల తీరు పట్ల వ్యతిరేకత వస్తుందనేది సర్వేల్లో తేలినట్లుగా విశ్వసనీయ సమాచారం. అటువంటి వారు నిర్దేశిత సమయంలోగా వైఖరి మార్చుకొని ప్రజలకు దగ్గర కావాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తారని తెలుస్తోంది. అంతర్గత రాజకీయాలు...వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని నిర్దేశించనున్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..సిద్దమవ్వాలంటూ
మే 2వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ .. జూలై 8న పార్టీ ప్లీనరీ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సీఎం జిల్లాల పర్యటనలు..క్షేత్ర స్థాయిలో నేరుగా పథకాల నిర్వహణ పైన పరిశీలనకు నిర్ణయించారు. ఈ మొత్తం వ్యవహారాలతో పాటుగా ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఎంత కీలకమో..పార్టీ నేతలకు సీఎం జగన్ స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో..27న జరిగే పార్టీ ముఖ్యుల సమావేశంలో సీఎం జగన్ కీలక అంశాలను వెల్లడించనున్నారనే సమాచారంతో ఈ భేటీ పైన ఆసక్తి పెరుగుతోంది.