ఏపీ సర్కార్ మరో ముందడుగు..గ్రామ సచివాలయాల్లోడిజిటల్ పేమెంట్స్..ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రభుత్వం మరొక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రారంభించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి . గ్రామాలలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేలా ప్రభుత్వ సేవలు ప్రతి గడపకు అందేలా నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు సహకారంతో ఇకనుండి గ్రామాలలోని గ్రామ, వార్డు సచివాలయం యూపీఐ చెల్లింపులు చేయవచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం 15004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, గ్రామాల ప్రజలకు 543 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు తాజాగా డిజిటల్ పేమెంట్ సిస్టం కూడా తీసుకు వచ్చింది. గ్రామాలలోని వినియోగదారులు ఇకనుండి ఎలాంటి సేవకైనా డిజిటల్ పేమెంట్ చేసేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో డిజిటల్ పేమెంట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ మాట్లాడుతూ డిజిటల్ విధానంతో ముందుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ అని, ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కూడా తీసుకువచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్రాల సహాయంతోనే డిజిటల్ భారత్ సాధ్యమవుతుందని, అలా డిజిటల్ విధానంతో ముందుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ అని ఆయన అభినందనలు తెలియజేశారు.