ఆదానీకి జగన్ బంపరాఫర్: ఢిల్లీలో సూచన..వెంటనే ఓకే : నాడు అంబానీ కోసం..నేడు...!!
ఆదానీ. అపర కుబేరుడు. అన్ని పార్టీలతో ప్రధానంగా బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహిత వ్యక్తి. ప్రాజెక్టుల..కాంట్రాక్టులు దక్కించుకోవటంలో సిద్ద హస్తులు. పార్టీలకు అండగా నిలవటమే కానీ..ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం లేని రిచెస్ట్ పొలిటిషీయన్. ఆసియా కుబేరుల జాబితాలో ఒక్కో సారి అంబానీని దాటి వెళ్లిపోతున్నారు. అటువంటి ఆదానీ ఇప్పటికే ఏపీలో వ్యాపారాలు ప్రారంభించారు. గంగవరం పోర్టులో 90 శాతం పైగా ఆదానీకి వాటా కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా ఆదానీకి రాజకీయంగా ఇక కీలక అవకాశం కల్పంచే అంశంలో జగన్ ఢిల్లీ పర్యటనలో ముందు ఒక ప్రతిపాదన వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

వైసీపీ నుండి రాజ్యసభకు ఆదానీ..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి నమ్మకస్తుడుగా ఉంటున్నారు. బీజేపీ తాము చేయలేని కొన్ని నిర్ణయాలు జగన్ ద్వారా అమలయ్యేలా చేస్తోంది. అంబానీ గ్రూపులో కీలక స్థానంలో ఉన్న పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు విషయంలో బీజేపీ ముఖ్యనేత జగన్ కు సిఫార్సు చేసారు. బీజేపీ ఇవ్వాలి అనుకుంటే పెద్ద సమస్య కాదు. కానీ, నేరుగా ఇవ్వటం వలన కొత్త సమస్యలు వస్తాయనే కారణంతో..ఆ బాధ్యతలు అప్పట్లో జగన్ కు అప్పగించింది. దీంతో..నేరుగా ముఖేష్ అంబానీ ఏపీ సీఎం నివాసానికి వచ్చారు. పరిమల్ నత్వానీ సైతం ఆయనతో పాటుగా జగన్ వద్దకు వచ్చారు. నత్వానీకి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతే, అంబానీ నేరుగా వచ్చి అడగటంతో జగన్ సైతం కాదన లేని పరిస్థితుల్లో ఓకే చెప్పారు. చెప్పిన విధంగానే వైసీపీ నుండి పరిమళ్ నత్వానీ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక, ఇప్పుడు అదే తరహాలో అదానీ విషయంలోనూ జగన్ వద్దకు ప్రతిపాదన వచ్చినట్లుగా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

వ్యూహాత్మక అంగీకారం
అందులో భాగంగా..బీజేపీ ముఖ్య నేతతో కలిసిన సమయంలో జగన్ ముందు ఆదానీకి సైతం రాజ్యసభ కు వైసీపీ నుండి అవకాశం కల్పంచాలని కోరారని చెబుతున్నారు. ఏపీలో భవిష్యత్ అవసరాలు.. పెట్టుబడులు ..పోర్టుల అంశాలు ఉండటంతో రాష్ట్రానికి ఉపయోగమని భావించినట్లుగా తెలుస్తోంది. దీంతో..2022 జనవరిలో వైసీపీకి రాజ్యసభలో మూడు స్థానాలు దక్కనున్నాయి. అందులో ఆదానీకి ఒక సీటు కేటాయిస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఆదానీకి రాజ్యసభ కావాలంటే..బీజేపీ - వైసీపీ మాత్రమే కాదు. దేశంలోని ఏ పార్టీ అయినా ఇవ్వటానికి రెడీగానే ఉంటుంది. అయితే ఆదానీకి బీజేపీ ముఖ్యనేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఇతర పార్టీల ద్వారా పెద్దల సభకు వెళ్లేందుకు సిద్దంగా లేరనేది మరో వాదన. అయితే, ఇలా పారిశ్రామిక వేత్తలను జగన్ పార్టీ ద్వారానే ఎందుకు రాజ్యసభకు పంపుతున్నారనేది మరో చర్చ.

వైసీపీ నుండే ఎందుకంటే
కేంద్రానికి మద్దతిస్తున్న జగన్...ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో భారీ విజయంతో పెద్దల సభలో సీట్లు సైతం వైసీపీకే వరుసగా దక్కనున్నాయి. ఇప్పటికే ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న వైసీపీకి రానున్న జనవరిలో మరరో మూడు సీట్లు పెరగనున్నాయి. దీని ద్వారా వైసీపీ లోక్ సభలో లాగానే..రాజ్యసభలోనూ నాలుగో పెద్ద పార్టీగా ఉండనుంది. అయితే, స్వతహాగా వ్యాపారవేత్త..కమ్ రాజకీయ నేత అయిన జగన్ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే తమ పార్టీ వారికి కేటాయించాల్సిన సీటును వారికి కేటాయించటానికి అంగీకరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉండటం ద్వారా పార్టీకి సైతం ఇమేజ్ మరింతగా పెరుగుతుందనే అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications