ఏపీ సీఎం కీలక నిర్ణయం..!అమరావతి భూములపై సీబిఐ దర్యాప్తు..?
అమరావతి/హైదరాబాద్ : అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. అమరావతి రాజధానికోసం రైతులు స్వచ్చందంగా ఇచ్చిన 33వేల ఎకరాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో అవతవకలు జరిగాయని వైసిపి ప్రభుత్వం మొదటినుండి ఆరోపిస్తుంది. అందుకు అనుగుణంగానే నిజాలను ప్రజలముందుంచేందుకు జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. వివాదాస్పందంగా మారిన నాలుగువేల ఎకరాల భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించేందుకు పావులు కదుపుతోంది. అందుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
పాలనలో మెరుపు వేగం: యాక్షన్లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్
అమరావతి భూముల్లో ఎన్నో అవకతవకలు..
అమరావతి భూవ్యవహారాలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తునకు వైసీపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పెద్దసంఖ్యలో అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన పలువురు ప్రముఖుల నేతృత్వంలో అక్రమాలు జరిగినట్లుగా తాము గుర్తించినట్లు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు బృందం గత కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
అసైన్డ్ భూములతో తలనొప్పులు..
అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న పలువురు నిరుపేద దళిత రైతులను నయానో భయానో లొంగదీసుకుని, ఆయా భూములను గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలతోపాటు వారి అండదండలతో మరి కొందరు తమ సొంతం చేసుకున్నారని వైసిపి ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తోంది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు నిషిద్ధమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దఎత్తున వాటిని దళితుల నుంచి పొందడం ద్వారా వారికి తీవ్ర నష్టం కలిగించి తాము భారీగా లబ్ధి పొందారని పేర్కొంది. ఈ విధంగా రాజధానిలోని పలు గ్రామాల్లో వివిధ రకాలకు చెందిన వందలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని నిర్దారించింది.
గత ప్రభుత్వ తప్పిదాలు..
అంతకుముందే ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దించి తెలుగుదేశం పార్టీ నేతలనుండి, రైతులనుండి వాస్తవ పరిస్థితులను బయపెట్టాలని చూసింది. భూసమీరణలో మొత్తం నూటా ఎనిమిది లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని, దళితుల నుంచి కేవలం ఐదు లక్షలతో ఎకరం కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్లాట్లు ద్వారా కోట్లు సంపాదించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఐటీ శాఖకు లేఖ రాసింది. రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్న ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుచేసింది. 2015 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి వరకూ జరిగిన లావాదేవీల జాబితా మొత్తం సీఐడీ లేఖతో జతచేసింది.
Recommended Video
అంతా పారదర్శకత కావాలి..
డాక్యుమెంట్ తారీఖు, రిజిస్ట్రేషన్, విక్రయదారు, కొనుగోలుదారు, భూమి విస్తీర్ణం, గ్రామం, సర్వే నంబర్, మండలం తదితర వివరాలు కూడా పేర్కొంది. అయితే మొత్తం లావాదేవీలు మంగళగిరి మండలానికి చెందినవే ఉండటం గమనార్హం. కొనుగోలు దారులు ఎక్కువగా హైదరాబాద్కు చెందిన వారుండగా గుంటూరు, ఉభయ గోదావరి, ఖమ్మం, ప్రకాశం జిల్లాలకు చెందిన వారుకూడా ఉన్నారు. కానీ వీరిలో కొందరు హైకోర్టును ఆశ్రయించడం, కొందరికి కోర్టు నిర్ణయం అనుకూలంగా రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టైంది. ఇలాంటి తరుణంలో కేసులన్నిటినీ సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి సీబీఐ ఈ కేసులను విచారణకు స్వీకరిస్తుందా లేదా కాలమే నిర్ణయించాలి.