జగన్ ఎఫెక్ట్.. కేసీఆర్ మీద ఒత్తిడి పెరుగుతోందా: ఆ సీఎం సమర్ధిస్తారా: బాబును దెబ్బ తీసేందుకే..!
ఏపీ నూతన సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద..పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ మీదనా. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి రెండు ప్రభుత్వాల మధ్య పోటీ వాతావరణం నెలకొని ఉంది. ఒక ప్రభుత్వం తీసుకొనే ప్రజాకర్షక నిర్ణయాలు మరో ప్రభుత్వం మీద ప్రభావం చూపుతున్నాయి. ఒకరు చేసిన నిర్ణయం మరొకరు ఎందుకు చేయలేరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు జగన పది రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు..తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచటం ఖాయంగా కనిపిస్తోంది. మరి..కేసీఆర్ ఏం చేయబోతున్నారు..

జగన్ నిర్ణయాతో కేసీఆర్ మీద ఒత్తిడి..
ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ తన పది రోజుల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తన పాదయాత్ర హామీలు .. మేనిఫెస్టోలో అంశాల అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానంగా ఆశా వర్కర్లకు జీతాల పెంపు.. సీపీఎస్ రద్దకు కమిటీ.. ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి నిర్ణయాలు ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మీద ప్రభావం చూపనున్నాయి. ఇవే డిమాండ్లు తెలంగాణలోనూ ఉండటం .. అక్కడ అమలు కోసం ఇప్పుడు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఏపీలో లోటు బడ్జెట్ ఉన్నా..ఇవన్నీ అమలు చేసే క్రమంలో నిర్ణయాలు తీసుకున్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం వీటిని అమలు చేయకపోవటం పైన సాధారణంగా అక్కడి ప్రజల్లో ఇప్పుడు చర్చ సాధారణం కానుంది. ఇప్పుడు మరి ఇవే డిమాండ్ల మీద తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి కరంగా మారింది.

చంద్రబాబుకు రాజకీయ నష్టం..
ముఖ్యమంత్రి జగన్ వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయంగా నష్టం చేయటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చే సమయంలో ఇచ్చిన హామీలను అయిదేళ్లు పూర్తయ్యే సమయంలో అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే, జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే
తాను ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆశా వర్కర్ల జీతాల పెంపు.. రైతు లకు 2014 నుండి పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు..ఇక, తాజా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇప్పుడు కేవలం అభివృద్ది అంశాల పైనే జగన్ను ప్రశ్నిస్తున్నారు. అమరావతి..పోలవరం వంటి అంశాల పైనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కేసీఆర్ సమర్ధిస్తారా..వ్యతిరేకిస్తారా
చంద్రబాబుతో వైరం కారణంగా జగన్..కేసీఆర్ మధ్య స్నేహం బలంగా ఉంది. ఏపీ-తెలంగాణ అభివృద్దిలో పోటీ పడాలని పదే పదే కేసీఆర్ చెబుతూ వచ్చారు. ఇక, చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కంటే.. కేసీఆర్ సమర్ధవంతంగా పని చేస్తున్నారంటూ తెలంగాణ నేతలు చెబుతూ వచ్చారు. మరి..ఇప్పుడు ఏపీలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణాలోనూ అమలు చేయాలనే ఒత్తిడి పెరిగితే.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీలో తీసుకున్న నిర్ణయాలను సమర్ధిస్తారా..అనేది ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications