'ఆ ఒక్కటీ అడక్కు'... ఎమ్మెల్యేలకు స్పష్టం చేస్తున్న సీఎం జగన్
రానున్న ఎన్నికల్లో రెండోసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి శతథా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీగా ప్రభుత్వం మీద వ్యక్తమయ్యే వ్యతిరేకతను అధిగమించడానికి, సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, ప్రభుత్వ పథకాలను వారికి అర్థమయ్యేలా వివరించడానికి ''గడప గడపకు మన ప్రభుత్వం'' పేరుతో కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. వార్డు సభ్యుల నుంచి మంత్రుల వరకు, సచివాలయంలో క్లర్కు నుంచి కలెక్టర్ల వరకు అందరూ ఇందులో భాగస్వాములయ్యారు.

ప్రతి మూడునెలలకు ఒక నివేదిక
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ప్రతి మూడునెలలకు ఒక నివేదిక అందజేస్తోంది. అంతేకాకుండా ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీతోపాటు మరో రెండు సంస్థలు మొత్తం నాలుగు సంస్థల నుంచి ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకుంటున్నారు. వీటికి సంబంధించి ఎమ్మెల్యేలతో సమావేశం కూడా నిర్వహించారు. ఆరునెలల్లోగా పనితీరు మార్చుకోనివారికి రాబోయే ఎన్నికల్లో సీటివ్వనని, తర్వాత తనను విమర్శించి ప్రయోజనం ఉండదని హెచ్చరించి పంపించారు. గెలుపే ప్రాతిపదికగా సీట్ల కేటాయింపు ఉంటుందంటూ ఎమ్మెల్యేలందరికీ ''తాడికొండ'' రూపంలో ఒక ఉదాహరణ కూడా చూపించారు.

నివేదికల వివరాలడుగుతున్న ఎమ్మెల్యేలు
తాజాగా ఎమ్మెల్యేల నుంచి జగన్పై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి తెప్పించుకున్న నివేదికల సారాంశాన్ని తమకు కూడా తెలియజేయాలని, ఆ ప్రకారం లోటుపాట్లు సరిచేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. కానీ ముఖ్యమంత్రి మాత్రం నివేదికల సారాంశాన్ని వారికివ్వడానికి ఇష్టపడటంలేదు. తాను గుప్తంగా ఉంచుకోవల్సిన సమాచారాన్ని మీతో ఎందుకు పంచుకుంటానని ఇటీవల ఇదే విషయమై తనను కలిసి ఒక ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం.

మారుతున్న పనితీరు
సీఎం తెప్పించుకున్న సర్వే నివేదికల ప్రకారం దాదాపు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలుస్తోంది. వీరిలో కొందరు సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ పనితీరు మార్చుకోవడానికి ఆరునెలల సమయం ఇచ్చాను.. ఆరునెలల తర్వాత పనితీరు మారి ప్రజల్లో మంచిపేరు వచ్చిందనుకుంటే అప్పుడు వివరాలు చెబుతానంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో బిజీగా మారిపోయారు. ఈ ఏడాది నవంబరు వరకు జరిగే ససగడప గడపకు మన ప్రభుత్వంసస కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏదేమైనప్పటికీ సర్వేలద్వారా తెప్పించుకున్న సమాచారంతోపాటు పనితీరు మారకపోతే సీటివ్వనని ఖరాఖండిగా చెప్పేయడం కూడా వారిలో మార్పునకు కారణమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications