పాముని పొడిచిన చీమలు: ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఆయన అక్షర సేనాధిపతి: వైఎస్ జగన్ సంతాపం
అమరావతి: రాష్ట్రానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత పట్ల రెండు ఏపీ, తెలంగాణల్లో దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. 78 సంవత్సరాల వంగపండు ప్రసాద రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. అదే సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Recommended Video
ప్రజా వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత: జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా..
ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు సహా తెలంగాణకు చెందిన ప్రజా ఉద్యమ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వంగపండు మృతితో పలువురు ప్రజా గాయకులు, కళాకారులు విషాదంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
వంగపండు ఇక లేరనే వార్త తనను కలచి వేసిందని వైఎస్ జగన్ చెప్పారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందని అన్నారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకున్న ప్రజా వాగ్గేయకారుడని చెప్పారు. పాముని పొడిచిన చీమలు ఉన్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి వంగపండు ప్రసాద రావు అక్షర సేనాధిపతిగా వ్యవహరించారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మరో ప్రజా ఉద్యమ కళాకారుడిగా అభివర్ణించారు. ఆయన కుటుంబానికి జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉత్తరాంధ్ర జానపదానికి శిఖర సమానుడని పేర్కొన్నారు.
వంగపండు ప్రసాదరావు మరణం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం ఉత్తరాంధ్ర కళ, సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన మరణించారనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. వందలాది జానపద గేయాలతో వంగపండు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారని సంతాపాన్ని తెలిపారు. కొన్ని తరాల పాటు ఆయన అందించిన అక్షర స్ఫూర్తి కొనసాగుతుందని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వంగపండు మరణం ఉత్తరాంధ్ర సాహితీ రంగానికి తీరనిలోటు అని మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు అన్నారు. తాను చిన్నప్పటి నుంచీ వంగపండు సాహితీ ఉద్యమాన్ని తిలకిస్తూ వచ్చానని అప్పలరాజు చెప్పారు. జననాట్య మండిల వ్యవస్థాపకుడిగా, జానపద గీతాలతో ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల ప్రజల్లో వంగపండు స్ఫూర్తినింపారని అన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ.. ఆయన రగిల్చిన స్ఫూర్తికి మరణం ఉండబోదని చెప్పారు.