చంద్రబాబు హయాంలో వర్షాలు కురిస్తే కదా..రోడ్లు దెబ్బతినడానికి: జగన్ ఫోకస్: డెడ్లైన్ ఫిక్స్
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా రోడ్ల రాజకీయం నడుస్తోంది. భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లను కేంద్రబిందువుగా చేసుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన జగన్ సర్కార్పై ముప్పేటదాడి చేస్తోన్నాయి. రోడ్లపై గుంతల్లో కూర్చుని మరీ నిరసన తెలుపుతున్నారు ఈ పార్టీలకు చెందిన నేతలు. వర్షాకాలానికి ముందు.. వర్షా కాలంలో ఏ ప్రభుత్వం కూడా రోడ్డు వేయదని, వానలు తగ్గిన తరువాతే రోడ్లను నిర్మిస్తారనే విషయం తెలిసినా కూడా రాజకీయ కారణాలతోనే టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

రోడ్ల నిర్మాణంపై
ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రోడ్లు-భవనాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి డెడ్లైన్ కూడా విధించారు. ఎప్పటి నుంచి వాటి నిర్మాణ పనులను చేపట్టాలనే విషయంపైనా అధికారులకు స్పష్టత ఇచ్చారు..

అక్టోబర్ నుంచి..
అక్టోబర్ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఆ తరువాత రోడ్ల నిర్మాణాన్నిచేపట్టాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి రోడ్లన్నింటినీ బాగుచేయాలని ఆదేశించారు. పకడ్బందీగా రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆయన చెప్పారు. రోడ్ల మరమ్మతు, వాటి నిర్మాణానికి చాలావరకు టెండర్లు పిలిచామని అన్నారు. ఎక్కడైనా టెండర్లు పిలకపోతే వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. అక్టోబర్లో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు..
క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని, ఆధారంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని విస్మరించిందని విమర్శించారు. చంద్రబాబుతోనే కాకుండా ఒక వర్గానికి చెందిన మీడియాతో యుద్ధం చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనినీ వక్రీకరిస్తున్నారని, ఎంత నెగిటివ్గా ప్రచారం చేసినా దాన్ని పట్టించుకోవద్దని అన్నారు.

తొమ్మిదివేల కిలోమీటర్ల మేర..
ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లు కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రోడ్ల కోసం ఆరు వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలిచామని చెప్పారు. గత ప్రభుత్వం కంటే అధికంగా పంచాయతీ రాజ్ రోడ్లు వేశామని అన్నారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో దాదాపుగా తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లను తమ ప్రభుత్వం కొత్తగా వేసిందని చెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వర్షాలు పడితే కదా..
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వర్షాలు కురవబోవని, అందుకే ఎప్పుడో వేసిన రోడ్లు కూడా బాగుంటాయని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతింటాయని, అక్టోబర్ నుంచి రోడ్ల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణం చేపడతామని అన్నారు. అన్ని రోడ్లు కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ను అడ్డుకోవడానికి రీజినల్ విజిలెన్స్ కమిటీలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశామని చెప్పారు. రాజకీయ కారణాలతోనే చంద్రబాబు, టీడీపీ నాయకులు, వారికి అనుబంధంగా కొనసాగుతున్న జనసేన నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications