ఏపీ కేబినెట్ ఏర్పాట్లు చకచకా- ప్రమాణస్వీకార ముహుర్తం ఖరారు-రేపు గవర్నర్ కు లేఖలు
ఏపీలో 24 మంత్రులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కేబినెట్ భర్తీ చేసేందుకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో మంత్రివర్గ ప్రమాణస్వీకారం చేసిన సచివాలయం పక్కన స్ధలంలోనే ఈసారి కూడా మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందుకోసం ఏప్రిల్ 11న ఉదయం 11.31 గంటలకు ముహుర్తం ఖరారుచేశారు.
ఏపీలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మంత్రుల నుంచి రాజీనామాలు స్వీకరించిన సీఎం జగన్.. వాటిని గవర్నర్ కు పంపేందుకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటు కొత్తగా ప్రమాణం చేసే మంత్రుల జాబితాలను కూడా రేపు గవర్నర్ హరిచందన్ కు పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. అక్కడ ఆమోద ముద్ర పడ్డాక రేపు సాయంత్రం కొత్త మంత్రులకు సమాచారం పంపనున్నారు. ఆ తర్వాత జగన్ స్వయంగా మంత్రులు కాబోయే వారికి ఫోన్లు చేసి సమాచారం ఇవ్వబోతున్నారు.
ప్రస్తుత కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారంతా రాజీనామాలు చేసినావారిలో దాదాపు 10 మంది వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. అయితే వీరి రాజీనామాలు కూడా ఇప్పటికే తీసుకున్నారు. దీంతో వీటిని కూడా గవర్నర్ కు పంపడంతో పాటు కొత్త మంత్రుల జాబితాలో వీరి పేర్లను ఉంచుతారు. గవర్నర్ ఆమోదముద్ర తర్వాత వీరికి కూడా సమాచారం పంపనున్నారు. దీంతో వీరు మరోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుుంది. వీరి పేర్లు అధికారికంగా వారికి పంపేవరకూ సస్పెన్స్ కొనసాగబోతోంది.