Ormax survey: కరోనా యాక్షన్ ప్లాన్: రెండో బెస్ట్ సీఎంగా వైఎస్ జగన్: టాప్-10 లిస్ట్ ఇదే
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో..అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నివారణ చర్యల మీదే దృష్టి సారించాయి. ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, ఆక్సిజన్ ఉత్పత్తి, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, అదనపు కోవిడ్ కేంద్రాల ఏర్పాటు, కరోనా పేషెంట్లకు అందుతోన్న వైద్య సదుపాయం, ఆహారం.. ఆయా చర్యలన్నింటినీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాధాన్యత కిందికి తీసుకొచ్చాయి. కరోనా వ్యాప్తిని నివారించడానికి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోన్నాయి. కర్ఫ్యూను విధించాయి. పాక్షిక లాక్డౌన్ను పాటిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలూ దీనికి మినహాయింపేమీ కాదు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే విషయంపై ఒర్మాక్స్ మీడియా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం- ఏప్రిల్లో మాత్రమే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి, పరిపాలనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక, దాని అమలు తీరును ఆధారంగా చేసుకుంది. అనంతరం అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాను రూపొందించింది. దాన్ని ప్రజామోదం కోసం విడుదల చేసింది.
Chief Minister Approval Rating - Monthly Update (April 2021): State-wise average for April 2021 #CMApprovalRating
— Ormax Media (@OrmaxMedia) May 6, 2021
Note:
1. Data collected over the entire month of April (Apr 1-30)
2. In the states that went into elections, the Chief Ministers named are those in office in April pic.twitter.com/aFJSR25mqD
ఈ జాబితాలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 55 పాయింట్లను ఇచ్చింది ఒర్మాక్స్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. అస్సాం, కేరళ ముఖ్యమంత్రులు శర్బానంద సొనొవాల్, పినరయి విజయన్ సంయుక్తంగా మూడో స్థానాన్ని చేజక్కించుకున్నారు. వారిద్దరికీ 54 చొప్పున పాయింట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. యోగి ఆదిత్యనాథ్-53, మమతా బెనర్జీ-52 పాయింట్లను సాధించారు.
Recommended Video
ముఖ్యమంత్రులు ప్రమోద్ సావంత్-గోవా, అరవింద్ కేజ్రీవాల్-ఢిల్లీ, శివరాజ్ సింగ్ చౌహాన్-మధ్యప్రదేశ్, నితీష్ కుమార్-బిహార్లకు టాప్-10 జాబితాలో చోటు దక్కింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు 15 స్థానంలో నిలిచారు. కేసీఆర్ పనితీరుకు ఒర్మాక్స మీడియా సంస్థ ఇచ్చిన పాయింట్లు 46. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పది 17వ స్థానం. 37 పాయింట్లు యడియూరప్పకు దక్కాయి. ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిలిచారు. ఆయన సాధించింది 22 పాయింట్లు మాత్రమే. మనోహర్ లాల్ ఖట్టర్-హర్యానా, త్రివేంద్ర సింగ్ రావత్-ఉత్తరాఖండ్, భూపేష్ బఘేల్-ఛత్తీస్గఢ్, హేమంత్ సోరెన్-జార్ఖండ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే విషయం తమ సర్వేలో తేలినట్లు ఒర్మాక్స్ పేర్కొంది.