చంద్రబాబుకన్నా ఆయనే వైఎస్ జగన్కు ప్రధాన ప్రత్యర్థి??
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా ఎంచుకోవాలి. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ జనసేన అధినేత పవన్కల్యాణ్ను లక్ష్యంగా ఎంచుకున్నారు. పవన్ ను ఎంత బలహీనపరచగలిగితే రానున్న ఎన్నికల్లో విజయం అంత సులువుగా దక్కుతుందనే యోచనలో జగన్ ఉన్నారు.
2014లోనే అధికారంలోకి రావాల్సింది?
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనే తాను కచ్చితంగా అధికారంలోకి వచ్చేవాడినని ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్ బలంగా విశ్వసిస్తుంటారు. పవన్కల్యాణ్ అప్పటి ఎన్నికల్లో పోటీచేయకుండా చంద్రబాబుకు మద్దతివ్వడంద్వారానే టీడీపీ అధికారంలోకి రాగలిగిందనేది సీఎం భావన.
అంతేకుండా ఆ ఎన్నికల్లో వైసీపీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఐదు లక్షల ఓట్ల తేడానే ఉందని, స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోవడాన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంటారని ఆయన సన్నిహితులు చెబెతుంటారు. 2019 ఎన్నికల్లో అధికారం చేపట్టినప్పటికీ 2014 ఎన్నికలను ఆయన ఒక గుణపాఠంగా భావిస్తారు.
మరోసాటి అటువంటి తప్పు జరగకూడదు
2024లో జరిగే ఎన్నికల్లో మరోసారి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదనే పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనసేనను బలహీనపరచడంద్వారానే ఆ వ్యతిరేకను అధిగమించవచ్చనేది ప్రధాన ఆలోచనగా ఉంది. అందుకు తగ్గట్లుగా అవరోధాలుగా మారే అంశాలన్నింటినీ క్రోడీకరించి పార్టీ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
టీడీపీ, జనసేన పొత్తు పొడిస్తే నష్టం?
రానున్న ఎన్నికల్లో పొత్తులకు సిద్ధమని పవన్ స్వయంగా ప్రకటించడం, తెలుగుదేశం, జనసేన పొత్తుతో వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు రావడంలాంటివన్నీ ముఖ్యమంత్రి జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఉండటమే తనకు మేలని భావిస్తున్నారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు ఈసారి గుంపగుత్తగా జనసేనకు పడే అవకాశం ఉందంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పవన్ కు మద్దతిస్తే కాపు ఓట్లను చంద్రబాబుకు అమ్మేస్తారంటూ జగన్ వ్యాఖ్యానించారు. కాపు సామాజికవర్గంలో వైసీపీ బలం తగ్గకుండా వ్యూహం రచిస్తే ఈసారి ఎన్నికలను కూడా సులువుగా ఈదేయవచ్చనేది వైఎస్ జగన్ భావనగా ఉంది.