ప్రధానికి జగన్ కీలక సూచనలు- ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వర్చువల్ భేటీలో- ఏం చెప్పారంటే ?
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భఁగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో ఇవాళ వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు ముఖ్యంత్రులు పాల్గొన్నారు ఇందులో పాల్గొన్న సీఎం జగన్.. ప్రధానికి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పేద, ధనిక అంతరాల పెరుగుదలపైనా మాట్లాడారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ఇవాళ నిర్వహించిన వర్చువల్ భేటీలో పాల్గొన్న సీఎం జగన్.. దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవ్ దేశం యొక్క అద్భుతమైన గతాన్ని, 75 సంవత్సరాల ప్రశంసనీయ ప్రయాణంలో సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ విజయాలను ఆనందించడానికి, ముందుకు సాగుతున్న దేశం యొక్క పురోగతికి మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి సరైన సందర్భాన్ని అందించిందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించుకుంటున్నట్లు జగన్ తెలిపారు. ఏపీకి చెందిన స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేసే అవకాశం తనకు దక్కడంపై జగన్ ఆనందం వ్యక్తంచేశారు.
ప్రధానికి జగన్ కీలక సూచన
వర్తమాన అవసరాలు ఆర్థిక ప్రగతి ద్వారానే తీర్చబడుతున్నప్పటికీ, భవిష్యత్తు తరాల వారి అవసరాలను తీర్చుకునే సామర్థ్యంలో రాజీపడకుండా ఉండటం అత్యవసరమని సీఎం జగన్ తెలిపారు. సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందని, గత 15 సంవత్సరాలలో, దేశం యొక్క స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,27,423 మెగావాట్ల నుండి 3,84,116 మెగావాట్లకు పెరిగిందని జగన్ తెలిపారు. మరీ ముఖ్యంగా, గత 15 ఏళ్లలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 83,982 మెగావాట్ల నుంచి 2,34,058 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఫలితంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరిగి భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు.. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తికి స్వస్తి పలికి, ఇంధన అవసరాల కోసం పునరుత్పాదక వనరులపై మెరుగైన ఆధారపడటానికి దారితీసే విధానాలను రూపొందించే అపారమైన బాధ్యత తమపై ఉందన్నారు. అయినప్పటికీ, పునరుత్పాదక విద్యుత్ వనరుల లభ్యతలో సమస్యలు ఉన్నాయని జగన్ వెల్లడించారు. అయినా విద్యుత్ డిమాండ్ను తీర్చడం, కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం మధ్య సరైన సమతుల్యతను సాధింంచాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అసమానతల తగ్గించాలన్న జగన్
ప్రధాని మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో ఉచిత విద్య, ఆహార భద్రత, పెరిగిన గ్రామాల సంఖ్య విద్యుదీకరణ, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై స్పృహను పెంపొందించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్లను తయారు చేసుకోగలిగామని జగన్ పేర్కొన్నారు. కానీ దేశంలోని పేదలకు ఆర్థిక వృద్ధి తగినంతగా చేరలేదన్నారు. ఇటీవల వెలువడిన ప్రపంచ అసమానత నివేదిక 2022 అంచనా ప్రకారం దేశ జనాభాలో అగ్రశ్రేణి 10% , అగ్రశ్రేణి 1% మొత్తం జాతీయ ఆదాయంలో వరుసగా 57% మరియు 22% కలిగి ఉన్నారని జగన్ గుర్తుచేశారు. ఆదాయ అసమానత వల్ల గ్రామీణ రుణభారం పెరుగుతుందని, కొనుగోలు శక్తి తగ్గుతుందన్నారు. అలాగే గ్రామాల్లో మొత్తం డిమాండ్ కూడా తగ్గుతుందన్నారు. వీటి అడ్డంకులను గుర్తించడం, సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా సమస్యను అధిగమించాలని సూచించారు. తద్వారా సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధ్యం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.