వైసీపీ గెలుపుపై సీఎం జగన్ కీలక కామెంట్లు -ఆ ఇద్దరికే క్రెడిట్ -3రాజధానులకు అనుకూలమన్న సాయిరెడ్డి
రెండేళ్ల కిందటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తలపిస్తూ, ఆదివారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లకుగానూ ఏలూరు ఫలితం వెలువడాల్సి ఉండగా, కౌంటింగ్ పూర్తయిన మొత్తం 11 కార్పొరేషన్లనూ అధికార పార్టీనే గెలుచుకుంది. అలాగే మొత్తం 75 మున్సిపాలిటీలకుగానూ 74 చోట్ల ఫ్యాను గాలి వీయగా, తాడిపత్రి టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. వైసీపీ ఘన విజయంపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఓటమిపై చంద్రబాబు స్పందన -సిగ్గుంటూ మళ్లీ కృష్ణాజిల్లాకు రావొద్దన్న మంత్రి కొడాలి నాని
వైసీపీ గెలుపు క్రెడిట్ ఆ ఇద్దరికి..
మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీడీపీ అక్రమ మార్గాల్లో విజయం సాధించిందని, బెదిరించి గెలవడూ ఓ గెలుపేనా? అని టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు భరోసా ఇవ్వగా, రాబోయే రోజుల్లో సత్తా చాటుదామంటూ జనసైనికులకు పవన్ ధైర్యం నూరిపోశారు. అందరికంటే ఆలస్యంగా ఫలితాలపై స్పందించిన సీఎం జగన్ మాత్రం.. వైసీపీ గెలుపు క్రెడిట్.. ప్రజలకు, దేవుడికి దక్కుతుందన్నారు.
నా బాధ్యతను పెంచింది..
''ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మా , ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది. ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను'' అంటూ ఏపీ సీఎం జగన్ ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేశారు. మరోవైపు..
3 రాజధానులకు జనాశీర్వాదం..
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మూడు రాజధానుల వివాదం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్లు మూడింటినీ వైసీపీ గెలుచుకోవడం.. జగన్ తలపెట్టిన మూడు రాజధానులకు అనుకూలంగా జనం ఇచ్చిన తీర్పు ఇదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో చంద్రబాబు, లోకేశ్ నీతిమాలిన రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జీవీఎంసీలో టీడీపీ గట్టిపోటీ ఇవ్వడం, వైసీపీ చాలా వార్డులు పోగొట్టుకోవడంపై విశ్లేషణ చేసుకుంటామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.