గ్యాంగ్ రేప్ బాధితురాలికి బాసట.. నష్ట పరిహారం చెల్లించాలన్న సీఎం జగన్..5 లక్షలు ప్రకటించిన హోంమంత్రి
ప్రకాశం : ఒంగోలు గ్యాంగ్ రేప్ అధికార, విపక్షాల మధ్య దుమారం రేపుతోంది. వైసీపీ కార్యకర్త మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. మరోవైపు దివ్యాంగుడైన బాజీలో దాగి ఉన్న నరరూప రాక్షసుడు బయటపడటంపై రాష్ట్రవ్యాప్తంగా ఆక్రోశం వ్యక్తమవుతోంది.
బాజీ చేసిన అరాచక పర్వం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో ఏదో సందర్భంలో సీఎం జగన్తో ఆ రాక్షసుడు దిగిన ఫోటో టీడీపీ నేతలకు అస్త్రంగా మారింది. దివ్యాంగుడైన బాజీ వైసీపీ కార్యకర్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని ఫేస్బుక్ పేజీ ఆధారంగా వైసీపీకి సన్నిహితంగా ఉంటాడనే విషయం అర్థమవుతోందని వాదిస్తున్నారు. అదలావుంటే నారా లోకేశ్ సైతం ఆ ఘటనపై సీరియస్గా స్పందించారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేయడం అమానుషం అంటూ ట్విట్టర్ వేదికగా అధికార పార్టీకి చురకలు అంటించే ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో ఏపీ అంతా సేఫ్ గా లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్త ఇంతటి ఘోరానికి పాల్పడటం సిగ్గుచేటని పేర్కొన్నారు.
Recommended Video
దివ్యాంగుడే.. కానీ రాక్షసుడు.. ప్రకాశం జిల్లా గ్యాంగ్రేప్ కేసులో సంచలన నిజాలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మైనర్ బాలిక ఫిర్యాదుతో 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే త్వరితగతిన స్పందించి నిందితులను అరెస్ట్ చేసినందుకు పోలీస్ అధికారులను మెచ్చుకున్నారు జగన్. బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని హోం మంత్రిని ఆదేశించారు. దాంతో 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని హోం మంత్రి సుచరిత తెలిపారు. కాగా పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని జగన్ సూచించారు.