ఎయిడెడ్ స్వచ్ఛందమే: నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు: తేల్చిచెప్పిన వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్రంలో కొంతకాలంగా వివాదాలకు కేంద్రబిందువు అవుతోన్న ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎయిడెడ్ అంశంపైనా ఓ స్పష్టతను ఇచ్చారు. ఎయిడెడ్ స్వచ్ఛందమేనని, ఇందులో ఎలాంటి బలవంతం లేదని అన్నారు. తామే నిర్వహించుకోగలుగుతామనుకుంటే.. నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చనీ తేల్చి చెప్పారు.
కుప్పం మొట్టమొదటి మున్సిపల్ ఛైర్మన్గా డాక్టర్ ఎంపిక: చంద్రబాబుతో సై అంటే సై
వచ్చే ఏడాది నుంచి నూతన విద్యావిధానం..
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను వెంటనే చేపట్టాలని అన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యే నాటికి అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యను కూడా గుర్తించాలని, వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు కావాలని చెప్పారు.
డైట్ సంస్థల సామర్థ్యాన్ని పెంచాలి..
టీచర్ ట్రైనింగ్ ఇస్తోన్న డైట్ సంస్థల సామర్థ్యాన్ని పెంచాలని వైఎస్ జగన్ ఆదేశించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణను అందించేలా తీర్చిదిద్దాలని చెప్పారు. పాఠశాలల్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే ఫీడ్ బ్యాక్ అందజేసేలా ప్రత్యేకంగా కాల్ సెంటర్ నంబర్ను అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. ప్రతి పాఠశాలలోనూ ఆ నంబర్ అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కాల్ సెంటర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, ఆ సమస్యలను పరిష్కరించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎయిడెడ్ స్వచ్ఛందమే..
ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమేనని, ఇందులో ఎలాంటి బలవంతం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో పాఠశాలలు, కళాశాలలను నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే ఇచ్చిందని వివరించారు. వాటిని నడిపించుకోగలుగుతామనుకుంటే విలీనం చేసిన పాఠశాలలను కూడా వెనక్కి తీసుకోవచ్చని వైఎస్ జగన్ అన్నారు. విలీనం చేసినప్పటికీ.. ఆ పాఠశాలలు, కళాశాలల పేర్లను మార్చబోమని, పాతవాటినే కొనసాగిస్తామని చెప్పారు. ఈ విషయంలో అపోహలకు గురి కావొద్దని అన్నారు.
మరుగుదొడ్లు నిర్వహణ
మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నాణ్యమైన సదుపాయాలను కల్పించాలనేది అందరి లక్ష్యం కావాలని చెప్పారు. అప్పుడే వందశాతం ఫలితాలను రాబట్టుకోగలుగుతామని అన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై నిరంతరం తనిఖీలు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు దుర్గంధంతో నిండిపోయి ఎవరూ వినియోగించని పరిస్థితులు చూశామని, అలాంటి పరిస్థితులను నాడు-నేడుతో మార్చగలిగామని చెప్పారు.
గోరుముద్దపై ఫీడ్ బ్యాక్
గోరుముద్దపై క్రమం తప్పకుండా విద్యార్థులు, వారి తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించాలని చెప్పారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు గోరుముద్ద అమలు తీరును పర్యవేక్షించాలని అన్నారు. లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్ను పిల్లలకు తెలియజేయాలని అన్నారు.