కరోనా వైరస్ : ఇదీ ఏపీలో పరిస్థితి.. సీఎం జగన్ కీలక సూచనలు..
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 40కి చేరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా నమోదైన కేసుల వివరాలు.. నియంత్రణ చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నమోదైన 17 కేసుల్లో.. ఎక్కువమంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగి జమాతే సదస్సుకు హాజరైనవారిగా సీఎంకు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ప్రార్థనల కోసం రాష్ట్రం నుంచి వెళ్లినవారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసినవారి వివరాలను సేకరించామన్నారు. జమాత్ నిర్వాహకుల నుంచి, పోలీసుల నుంచి, రైల్వే నుంచి.. ఇలా వివిధ రకాలుగా సమాకారాన్ని సేకరించి వారిని క్వారంటైన్కు, ఐసోలేషన్కు తరలిస్తున్నామని చెప్పారు. వారి నివాస ప్రాంతాల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టామని.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వాళ్లంతా.. స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపు..
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రార్థనలకు వెళ్లినవారు స్వచ్చందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వమే వారికి వైద్యం అందిస్తుందని.. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలిపారు. పోలీసులు,వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో.. ఢిల్లీ వెళ్లి వచ్చినవారిని గుర్తించి వారికి వైద్య సదుపాయాలు అందజేయాలన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే జరుగుతోందా అని సీఎం ఆరా తీశారు. ప్రతీ రోజూ ప్రతీ కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు స్వచ్చందంగా ముందుకొస్తే.. వారి కుటుంబాలకు,సమాజానికి మేలు చేసినవారవుతారని చెప్పారు.

సొంతంగా కూడా రిపోర్ట్ చేయవచ్చు..
చదువుకున్నవారు, అవగాహన ఉన్నవారు నేరుగా వెబ్సైట్ ద్వారా లేదా కాల్ సెంటర్ ద్వారా సొంతంగా తమ ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టు చేసే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు సీఎంకు తెలిపారు. సూపర్ మార్కెట్లు, రైతు బజార్ల ద్వారా డోర్ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రతీ దుకాణం ముందు ప్రకటించిన ధరలతో పట్టికను ప్రదర్శించాలని సీఎం ఆదేశించగా..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని దుకాణాల ముందు పెట్టిస్తామన్నారు. ధరల నియంత్రణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సీఎం సూచించారు.

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై సూచనలు
తాత్కాలిక పరిష్కారంగా ప్రస్తుతానికి రైతులనుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అరటి, టమోటా లాంటి రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు జరపాలన్నారు. నిల్వ చేయలేని పంటల విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. దీనిపై తక్షణం సంబంధిత అధికారులు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అలాగే శాశ్వత పరిష్కారాల పైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జనతా మార్కెట్ల ఏర్పాటుపై ఆలోచించాలన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డిమాండ్కు తగినట్టుగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేయడంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఆ మేరకు పంపిణీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇతర ప్రభుత్వాలు అనుసరించే మంచి విధానాలను పరిశీలించి ఏపీలో అమలుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఆక్వాపై సమీక్ష
69 ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో 41 చోట్ల ఇప్పటికే పని ప్రారంభమైందని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ సిబ్బందితో పనిచేయిస్తున్నారని చెప్పారు. అమెరికా, చైనాలకు కూడా ఇక్కడినుంచి ఎగుమతి ప్రారంభమైందన్నారు. సోమవారం(మార్చి 30)న విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్ నుంచి 4 కంటైనర్లతో ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేసినట్టు తెలిపారు. ప్రాసెసింగ్ కేంద్రాల్లో వర్కర్స్ పాసులు జారీ చేసేందుకు జిల్లాల్లో ఉన్న కంట్రోల్ రూమ్లతో మాట్లాడుతున్నామని మత్స్యశాఖ అధికారులు చెప్పారు.
వారినుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications