ఏపీ సీఎం భీమవరం పర్యటన: వరుస పేలుళ్ల కలకలం, సెర్చ్ ఆపరేషన్, భారీ బందోబస్తు
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. ఈ పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ పరిశీలించారు. పేలుడు ఎలా జరిగిందో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భీమవరంలో పేలుడు.. సీఎం పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. ఉండి రోడ్డులోని జంట కాలువల సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు బాంబుతో సంభవించిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం భీమవరంలో పర్యటించనుండగా.. పేలుడు సంభవించడంతో పోలీస్, అధికార యంత్రాంగాలు కలవరపడ్డాయి.
రంగంలోకి బాంబ్ స్క్వాడ్.. పేలుడుకు అదే కారణమా?
సీఎం పర్యటన కోసం వచ్చిన బాంబ్ స్క్వా డ్ పేలుడు సంభవించిన ప్రాంతంలో అణువణువు తనిఖీ చేసింది. సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్దేవ్ శర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన బాంబు పేలుడు వల్ల సంభవించలేదని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. పాత ఫ్రిజ్లోని గ్యాస్ సిలిండర్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ఏదైనా బ్యాటరీ వల్ల గాని పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. నిపుణులు పరీక్షల అనంతరమే దీనికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు.
ఆవు కాలు వేయడంతో పేలుడు..
కాగా, పెట్రోల్ బంక్ పక్కన ఎంతోకాలంగా పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు. షాపు వెనుక ఖాళీ ప్రదేశంలో పాత ఇనుప సామగ్రిని నిల్వ చేస్తుంటారు. అదే ప్రాంతంలో పచ్చిక ఉండటంతో నిత్యం ఆవులు మేత కోసం అక్కడికి వస్తుంటాయి. శుక్రవారం రాత్రి ఆవులు పచ్చగడ్డి మేస్తుండగా ఒక ఆవు గుర్తుతెలియని వస్తువుపై కాలువేయడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆవు వెనుక కాలు పూర్తిగా దెబ్బతినగా.. పొట్టభాగంలో తీవ్ర గాయమై కదలలేని స్థితిలో పడిపోయింది. దీంతో ఆవును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు శబ్దం చాలాదూరం వినిపించినట్టు చెబుతున్నారు. మరోవైపు, భీమవరం బైపాస్లో అర్థరాత్రి కెమికల్ ట్యాంకర్ పేలింది. వెల్డింగ్ చేస్తున్న సమయంలోనే ట్యాంకర్ పేలినట్లు పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ పేలుడుతో కరెంటు తీగలు తగిలి రేకుల షెడ్డు ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Recommended Video
ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూతురు పెళ్లికి సీఎం జగన్
కాగా, భీమవరం పర్యటనలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరవుతారు. శనివారం ఉదయం 11.15 గంటలకు వివాహ వేదిక కె కన్వెన్షన్ కు సమీపంలో ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 11.25 గంటలకు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి హెలిప్యాడ్కు చేరుకుని తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా హెలిప్యాడ్ వద్దకు ప్రధానమైన వారిని మినహా ఇతరులను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, సీఎం జగన్ వస్తుండటంతో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు స్థానిక నేతలు.