ఖమ్మం ఖిల్లాలో వైఎస్ జగన్ ఎంట్రీ: చెల్లి కోసమా?: ఎనిమిదేళ్ల తరువాత రాక
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టులో తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిపట్టు ఉన్నట్టుగా భావిస్తోన్న ఖమ్మం ఖిల్లాలో ఆయన ఎంట్రీ ఇవ్వనున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఖమ్మం పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కానుంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఖమ్మం వెళ్లారాయన. ఇప్పుడు మళ్లీ ఖమ్మం గడ్డపై అడుగు పెట్టనున్నారు.

17న ముహూర్తం..
దీనికి ముహూర్తం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. ఆగస్టు 17వ తేదీన వైఎస్ జగన్ ఖమ్మం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. లోక్సభ మాజీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్కు ఆయన హాజరు కానున్నారు. అగస్టు 12వ తేదీన సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డి వివాహం జరుగనుంది. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానితులను కూడా కలుస్తోన్నారు.

కేసీఆర్కు ఆహ్వానం..
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. లగ్న పత్రికను అందజేశారు. కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఇదివరకు 2019లో పొంగులేటి కుమారుడు హర్షా రెడ్డి వివాహానికీ వైఎస్ జగన్ హాజరైన విషయం తెలిసిందే. హైదరాబాద్లో నిర్వహించిన తన సమీప బంధువు బలరాం రెడ్డి-అప్పటి మెదక్ జిల్లా ఎస్పీ చందనదీప్తి వివాహం వేడులతో పాటు హర్షా రెడ్డి శుభ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నా

పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్కు..
ఇప్పుడు తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. వైఎస్ జగన్కు పొంగులేటి అత్యంత సన్నిహితుడు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంలోనూ ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో పొంగులేటి అధికార టీఆర్ఎస్లో చేరారు.

జగన్తో అనుబంధం.
పార్టీ మారినప్పటికీ.. వైఎస్ జగన్తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన కొనసాగిస్తోన్నారు. ఈ ఏడాది జవనరిలో ఆయన స్వయంగా తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున సాగింది. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయాయి. కాగా- ఇప్పుడదే ఖమ్మంలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ చెల్లెలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు.

రాజకీయాల ప్రస్తావన..
ఇది పూర్తిగా వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటనే అయినప్పటికీ.. రాష్ట్ర, జిల్లా రాజకీయాలకు చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికీ తనకంటూ ఓటుబ్యాంకు ఉందని వైఎస్ఆర్సీపీ బలంగా నమ్ముతోంది. దీన్ని తన చెల్లి పార్టీ వైఎస్ఆర్టీపీకి బదలాయించేలా వైఎస్ జగన్ మంతనాలు సాగించవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి ఖమ్మం జిల్లాలో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మలచుకునేలా పావులు కదపొచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications