మళ్లీ గెలిచిన వైఎస్ జగన్ ? సచివాలయం కంటే బెటర్ గా ! ఏకగ్రీవంగా..!
ఏపీలో 2024 ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం వైఎస్ జగన్ అంతకంటే ముందే వరుస విజయాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారతారని భావిస్తున్న పలు వర్గాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో జగన్ సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పలు ఎన్నికలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇందులో ఒక దానిని మించి మరో దానిలో విజయాలు వరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ ఎన్నికల జైత్రయాత్ర
ఏపీలో 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అప్పటి నుంచి వరుస విజయాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన స్ధానిక ఎన్నికల్లోనూ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన జగన్ కు అనంతరం జరుగుతున్న ఎన్నికల్లోనూ విజయాలు వరిస్తున్నాయి. జగన్ నేరుగా బరిలోకి దిగకపోయినా, ఆయన అండ ఎవరికి ఉందో తెలిశాక ఆయా వర్గాల నుంచి లభిస్తున్న మద్దతుతో అంతిమంగా ప్రభుత్వం కోరుకున్న వారే వరుసగా గెలుస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో విజయం లభించింది.
సచివాలయ ఎన్నికల్లో విజయం
తాజాగా జరిగిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అనధికార అభ్యర్ధి కాకర్ల వెంకట్రామిరెడ్డిని జగన్ గెలిపించుకున్నారు. ఎక్కడా బహిరంగంగా చెప్పకపోయినా సీఎం అభ్యర్ధిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకట్రామిరెడ్డి ఈ ఎన్నికల్లో అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ అనధికార అభ్యర్ధి అయిన వెంకట్రామిరెడ్డిపై వ్యతిరేకత ఉంటుందని భావించినా అలా జరగలేదు. దీని వెనుక కీలక కారణాలున్నాయి. ప్రభుత్వ అభ్యర్ధి అని తెలిసీ ఆయన్ను ఓడిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్న భయాలే ఇందుకు కారణమన్న వాదన ఫలితాల తర్వాత వినిపించింది.
ఎన్జీవో ఎన్నికల్లో ఏకగ్రీవం
రాష్ట్ర ప్రభుత్వంతో పలు అంశాలపై పోరాడుతున్న బండి శ్రీనివాసరావు, శివారెడ్డి నేతృత్వంలోని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కమిటీ మరోసారి పోటీ కోసం ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం నేపథ్యంలో వీరికి వ్యతిరేకంగా మరెవరైనా పోటీకి దిగుతారని ఉద్యోగులు కూడా భావించారు. కానీ ఇక్కడా అలా జరగలేదు. బండి ప్యానెల్ కు వ్యతిరేకంగా పోటీకి దిగేందుకు ఉద్యోగులు సాహసించలేదు. దీని వెనుక ప్రభుత్వ మద్దతుతో పాటు ప్రస్తుత పరిస్దితుల్లో జగన్ సర్కార్ తో పోరాడి ఉద్యోగులకు వారి ప్రయోజనాలు ఇప్పించే పరిస్దితుల్లో మిగతా వారు లేకపోవడమే. దీంతో ఎన్జీవో ఎన్నికలు చాలా సంవత్సరాల తర్వాత ఏకగ్రీవంగా ముగిశాయి.
కంగ్రాట్స్ చెప్పిన జగన్
నిన్న ఏపీ ఎన్జీవో ఎన్నికల్లో పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ప్యానెల్ సభ్యులు ఇవాళ సీఎం జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్ సభ్యులు జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ప్యానల్ కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి చెప్పి పంపించారు.