చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్...జనసేన కూడా హాజరు:వామపక్ష నేతల ప్రకటన
విజయవాడ: నవ నిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్రంలో టిడిపి రాజకీయం చేస్తోందని వామపక్ష నేతలు మధు, రామకృష్ణ విమర్శించారు. అమరావతిలోని దాసరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
టిడిపి నేతలు వివిధ రకాల దీక్షల పేరుతో ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారని సిపిఐ,సిపిఎం నేతలు రామకృష్ణ, మధు మండిపడ్డారు. ప్రభుత్వ ధనంతో దీక్షలు చేస్తూ విపక్షాలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పాలన సాగుతోందని మధు, రామకృష్ణ ఆరోపించారు. అందుకే చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై తాము చార్జిషీట్ పెడతామని తెలిపారు.

నవనిర్మాణ దీక్షల్లో...సవాళ్లే...
టిడిపి ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలు కూడా సవాళ్లు, ప్రతిసవాళ్లే ప్రధానంగా సాగుతున్నాయన్నారు. ప్రభుత్వ ధనంతో పెద్దఎత్తున వివిధ దీక్షల పేరుతో సభలు,సమావేశాలు నిర్వహిస్తూ వాటిల్లో ప్రతిపక్షాలపై విమర్శలు కురిపించడం...ఇదేనని టిడిపి నేతలు చేస్తున్న పని అని వామపక్ష నేతలు ధ్వజమెత్తారు.

అందుకే...ఛార్జిషీట్
టిడిపి పాలన అంతా అవినీతి మయం అయిందని...ఎక్కడ చూసినా అక్రమాలే కనిపిస్తున్నాయని వామపక్ష నేతలు దుయ్యబట్టారు. ఇంతటి అవినీతి గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు, జగన్ లాలూచీ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేకపోతోందని వామపక్షనేతలు వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై తాము చార్జిషీట్ పెడతామని తెలిపారు.

రాజకీయ శిక్షణా తరగతులు...జనసేన కూడా
ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన 13 జిల్లాల రాష్ట్ర నాయకత్వానికి ఈనెల 20న విజయవాడ సిద్దార్థ కాలేజీ గ్రౌండ్లో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సిపిఎం,సిపిఐ నేతలు మధు,రామకృష్ణ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జనసేన కార్యకర్తలు కూడా హాజరవుతారని వెల్లడించారు.

ఈ నెల 9న...నిరసన
కేంద్రం పెట్రోల్ ధరలను పెంచినా కేరళలోని వామపక్ష ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడాన్ని మిగతా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవాలని...కానీ టిడిపి ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగే కార్యక్రమం ఏదీ చేపట్టదని వామపక్షనేతలు ఎద్దేవా చేశారు. ఈనెల 9న పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరశిస్తూ విజయవాడలో చేపట్టే ఆందోళన కు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, లారీ, టాక్సీల ఓనర్లు పాల్గొంటారని వామపక్షనేతలు వివరించారు.












Click it and Unblock the Notifications