సోము వీర్రాజు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు: శివాజీ
అమరావతి: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివాజీ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహరశైలిపై మండిపడ్డారు.
ఏపీలోని 5 కోట్ల మంది ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బిజెపి నేత సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్లే న్యాయం జరుగుతోందన్నారు. కానీ, ఏపీకి అన్యాయం జరుగుతున్నా న్యాయం జరిగిందనే ధోరణిలో వీర్రాజు మాట్లాడడం విడ్డూరంగా ఉందని శివాజీ ఆక్షేపించారు.
ఏపీకి అన్యాయం జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం పట్ల శివాజీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టిడిపి నేతలు మేల్కొన్నారని చెప్పారు.
ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలనే డిమాండ్తో పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళన చేయడం మంచి పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీకి అన్యాయం జరిగిందని అందరూ చెబుతున్నా సోము వీర్రాజు మాత్రం ఏపీకి న్యాయం జరిగిందని కథలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.