ఏపీ పార్టీలో ఒక్కరూ మిగలరు: డిగ్గీకి దిమ్మతిరిగే షాకిచ్చిన నేతలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు దిమ్మదిరిగిపోయే షాకిచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు దిమ్మదిరిగిపోయే షాకిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసికట్టుగా ఉందని వివరించారు. అంతేగాక, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ ఉండదనే సంకేతం కూడా ఇచ్చినట్లు తెలిసింది.
ఘోర పరాభవంపై..
ఆ వివరాల్లోకి వెళితే.. సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన సమావేశం జరిగింది. కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి రామచంద్రయ్య, కాసు వెంకటకృష్ణారెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొవడంపై వాడి వేడి చర్చ జరిగింది.
ఒక్కరూ మిగలరు...
ఈ సందర్భంగా ఏపీలో పార్టీ కొంతవరకైనా బలపడకపోతే.. కాంగ్రెస్లో ఒక్క నాయకుడు కూడా మిగిలే పరిస్థితి లేదని దిగ్విజయ్ సింగ్కు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు తేల్చి చెప్పినట్లు తెలిసింది.
సోనియా సీరియస్..
కాగా, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపాలవడం పట్ల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్గా ఉన్నారంటూ ఈ సందర్భంగా డిగ్గీ ఏపీ నేతలతో అన్నట్లు తెలిసింది.
నాదే బాధ్యత
ఇది ఇలావుంటే.. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తనదేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు ఓసారి ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని దిగ్విజయ్ సూచించారు. దీంతో ఏపీ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.