మీరే జోక్యం చేసుకోవాలి: ఉమ్మడి ఆస్తులపై తెలంగాణ నుంచి నో రెస్పాన్స్
అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్లోని ఉమ్మడి సంస్ధల ఆస్తుల విభజన రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎస్పీ టక్కర్ కేంద్రానికి లేఖ రాశారు. ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి సంస్ధల ఆస్తులకు సంబంధించి ఆదేశాలను జారీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి ఆస్తుల విభజనకు తెలంగాణ సర్కారు సహకరించని నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కేంద్రమే రెండు నెలల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన జరిగే వరకు అవి ఏపీకే చెందుతాయి.
కానీ, ఆ సంస్థలు తమవేనంటూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉన్న సంస్థలు తెలంగాణకు, ఏపీలో ఉన్న సంస్థలు ఏపీకి చెందుతాయని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. కాగా, పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో 123 సంస్థలు హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి.
దీంతో హైకోర్టు తీర్పుతో ఏపీకి తీవ్ర అన్యాయం జరగడంతో, ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా పదో షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులను 58:42 నిష్పత్తిలో పంచాలని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
రెండు రాష్ట్రాలు దీనిపై అవగాహనకు రావాలని సూచించిన సుప్రీం కోర్టు అలా జరగని పక్షంలో కేంద్రమే ఒక కమిటీని నియమించి 2 నెలల్లోగా పదో షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులను విభజించాలని తెలిపిందని సీఎస్ తన లేఖలో వివరించారు. దీనిపై చర్చించేందుకు ఏపీ సీఎస్ చాలారోజుల క్రితమే తెలంగాణ సీఎస్కు లేఖ రాశారు.
అయితే తెలంగాణ సీఎస్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తాజాగా సోమవారం కేంద్రానికి ఆయన లేఖ రాశారు. జూన్ 27 నుంచి ఏపీ పాలన మొత్తం అమరావతి నుంచి జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి సంస్థల విభజనపై కేంద్రమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.