డిప్యూటీ సీఎం ఆళ్లనానికి చేదు అనుభవం- ఏలూరులో ఓటు గల్లంతు
తుది కంటా ఉత్కంఠ రేపిన ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణపై లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ తర్వాత ఎన్నికలకు అనుమతి ఇచ్చారు. అయితే ఎన్నికల జాబితాలో అక్రమాల వ్యవహారం ఇప్పుడు స్ధానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఆళ్లనానికి కూడా చేదు అనుభవాన్ని మిగిల్చించి.
ఇవాళ ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు శనివారపుపేటలోని పోలింగ్ బూత్కు వెళ్లిన డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసేందుకు సిద్ధమైన తరుణంలో ఆయన ఓటు లేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. అదే విషయాన్ని నానికి తెలిపారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అయిన తన ఓటే గల్లంతు కావడం ఏంటని వారిని నిలదీశారు. చివరకు చేసేది లేక నిరాశగా వెనుదిరిగారు.
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఓటర్ల జాబితా తయాతీలో పలు అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ ఎన్నికలు నిలిపేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు తిరిగి ఎన్నికలకు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్లనాని ఓటు సైతం గల్లంతు అవుతుందని ప్రభుత్వం కూడా ఊహించి ఉండదు. కానీ ఇవాళ అదే జరిగింది. దీంతో ఏలూరు ఓటర్ల జాబితాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఏలూరులో ఓటర్ల జాబితాపై విపక్షాల విమర్శలకు బలం చేకూరినట్లయింది.