కేసీఆర్ అంటే అభిమానం! వైఎస్ జగన్, షర్మిల్ మధ్య విద్వేషాల్లేవు: ఏపీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిలపై వస్తున్న వంతులను కొట్టిపారేశారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాల్లేవు..
తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలపైనా నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. అన్నాచెల్లెలు మధ్య విభేదాలున్నాయన్నవి వదంతులు మాత్రమేనని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు.
కేసీఆర్ అంటే జగన్కు అభిమానం..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోమన్ రెడ్డికి ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు కాదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అంటే ఎంతో అభిమానం అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.
సీమకు నీళ్లివ్వాలని కేసీఆర్కూ ఉంది..
గతంలోనూ నారాయణస్వామి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆయన విన్నవించారు. రాయలసీమ ప్రజలకు నీరిచ్చి ఆదుకోవాలనే తపన కేసీఆర్కు కూడా ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. మనమేమీ పాకిస్థాన్, ఇండియా కాదని ఆయన చెప్పుకొచ్చారు. సాగునీటి అవసరాలను గుర్తించి ఇరు రాష్ట్రాలు నడుచుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
పొరుగు రాస్ట్రాలతో సఖ్యతేనంటూ జగన్..
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కట్టి తమ నీటిని దోచుకుంటోందంటూ తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో ఏపీ మంత్రులు, నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే, ఇరు రాస్ట్రాల సీఎంలు మాత్రం తమ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇరు రాష్ట్రాల మధ్య సత్ససంబంధాలను కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలతో తాము సఖ్యతనే కోరుకుంటున్నామని ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.