వరదలపై వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి వివరణ
తూర్పుగోదావరి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉధృతి పెరిగింది. దాంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం అధికారులు కూడా ఆయనకు వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అదలావుంటే వరద తీవ్రతపై ఎలాంటి వదంతులు నమ్మొద్దని కోరారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్.
ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. దేవీపట్నం వరద బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పుకొచ్చారు. ఆదివారం మండపేటలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎలాంటి భయాందోళన చెందొద్దని సూచించారు. ఆ క్రమంలో ఏదో జరిగిపోతోందంటూ జరుగుతున్న ప్రచారాలను, వదంతులను నమ్మొద్దని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు బియ్యం, పప్పులు, కిరోసిన్తో పాటు మెడిసిన్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు దాదాపు ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. లోకల్ పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అటు రెవెన్యూ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు. అదలావుంటే సోమవారం నాటికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications