ఎర్ర స్మగ్లర్ గంగిరెడ్డి సీఎంనే చంపబోయాడు: మారిషస్ పోలీసులతో ఏపీ డీజీపీ
అమరావతి: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ పోలీసులు బృందం మారిషస్కు వెళ్లింది. ప్రస్తుతం అతడిని ఏపీ పోలీసులకు అప్పగించేందుకు మారిషస్ పోలీసులు ఎట్టకేలకు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.
గంగిరెడ్డిని ఒకట్రెండు రోజుల్లో ఏపీకి తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.ఈ నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీతో కలిసి ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు రెండు రోజుల క్రితమే మారిషస్ వెళ్లారు. గంగిరెడ్డి అప్పగింతకు ఇంతకాలం ఆసక్తి చూపని మారిషస్ పోలీసులు ఉన్నట్టుండి మనసు మార్చుకోవడానికి గల కారణాలు తెలిశాయి.
నాలుగు రోజుల క్రితం ఏపీ డీజీపీ జేవీ రాముడు సీఐడీ అధికారులు, రాయలసీమ పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్గా ఎదిగిన కొల్లం గంగిరెడ్డికి సంబంధించిన అంశం ప్రస్తావనకు రాగా, అక్కడికక్కడే రాముడు మారిషస్ పోలీసులకు ఫోన్ చేశారు.
‘‘చోటా రాజన్ పై భారత్లో ఎన్ని కేసులున్నా ఒక్కదానిలోనూ శిక్ష పడలేదు. కానీ, మా మోస్ట్ వాంటెడ్ గంగిరెడ్డికి ఏపీలో ఓ కేసులో శిక్ష పడింది. చోటా రాజన్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు పూర్తి ఆధారాలు దొరకలేదు. అయినా పలువురు అమాయకులను చంపిన క్రిమినల్ కాబట్టి చోటా రాజన్ అరెస్ట్కు బాలి పోలీసులు సహకరించారు. గంగిరెడ్డి ఏకంగా మా సీఎంనే చంపబోయాడు. అది కూడా నిషేధిత మావోయిస్టులతో కలిసి. దీనికి సంబంధించి మీకు అన్ని ఆధారాలు ఇచ్చాం. పాస్ పోర్టు వివరాలు కూడా అందించాం. అయినా ఒక క్రిమినల్ను మాకు అప్పగించకుంటే ఎలా?'' అని జేవీ రాముడు ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో డీజీపీ రాముడు వాదనతో ఏకీభవించిన మారిషస్ పోలీసుల, ఏపీ పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం రండి అంటూ సమాధానమిచ్చారంట. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు మారిషస్ బయలుదేరి వెళ్లారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో కొల్లం గంగిరెడ్డిని ఏపీకి తీసుకురానున్నట్లు సమాచారం.