రైట్.. రైట్.. అమరావతికి వెళ్లడానికి ఏపీ ఉద్యోగులు రెడీ
పాలనా విభాగాలను వీలైనంత త్వరగా హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టిన ఏపీ ప్రభుత్వం జూన్ మూడో వారం వరకు ఆ పనులను పూర్తి చేసి సచివాలయ ఉద్యోగులందరిని అమరావతికి తరలించాలని యోచిస్తోంది.
కాగా.. రిటైర్ మెంట్ కి దగ్గరలో ఉన్న కొంతమంది ఉద్యోగులు అమరావతికి వెళ్లడం బదులు, స్వచ్చంద పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవడానికి మొగ్గు చూపుతుండగా.. మిగిలిన ఉద్యోగులంతా అమరావతికి మకాం మార్చడానికి ఇప్పటినుంచే మానసికంగా సన్నద్దమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల బృందం త్వరలోనే రాజధాని ప్రాంతాన్ని సందర్శించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న సౌకర్యాలను పరిశీలించనున్నారు. ఇదే విషయాన్ని ఏపీ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు సత్య సులోచన స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం వెనకాల నడవడానికి తామెప్పుడూ సిద్దంగానే ఉంటామని, ప్రభుత్వ నిర్ణయాలకు ఉద్యోగుల పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.