ఏపీలో రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె ! 1986లో ఏం జరిగింది ? ఎన్టీఆర్ బాటలోనే జగన్ పయనిస్తారా?
ఏపీలో ఉద్యోగుల పోరు సమ్మెకు దారి తీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చించినా పీఆర్సీలో మార్పులపై ఎలాంటి హామీ లభించలేదు. కేవలం హెచ్ఆర్ఏతో పాటు పెన్షన్ అదనపు క్వాంటం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోకపోతే సమ్మెకు వెళ్తామని ప్రకటించిన ఉద్యోగులు.. చివరి క్షణలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.
సమ్మెను నివారించేందుకు ఇన్నాళ్లూ సీరియస్ ప్రయత్నాలు చేయని ప్రభుత్వం.. చివరి క్షణంలో ఉద్యోగుల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మె అనివార్యమైతే ఏం జరగబోతోంది ? గతంలో ఇలాంటి పరిస్ధితి ఎదురైనప్పుడు ఏం జరిగిందనే అంశాల్ని ఓసారి తెలుసుకుందాం...
సమ్మె దిశగా పీఆర్సీ పోరు
ఏపీలో మెరుగైన పీఆర్సీ కోరుతూ ఉద్యోగులు రెండు నెలల క్రితం చేపట్టిన నిరసనలు ప్రభుత్వాన్ని ఏమాత్రం కదిలించలేకపోయాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని సాకుగా చూపుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ సహా ఇతర హామీల్ని అమలు చేసే విషయంలో వెనకడుగు వేసింది. దీంతో ఉద్యోగులు ఛలో విజయవాడ నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చాటారు.
ఆ తర్వాత ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం .. చివరి క్షణంలో వారితో చర్చలు జరుపుతోంది. ఇవి సఫలమైతే తప్ప రేపు సమ్మె ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
1986లో 53 రోజుల పాటు సమ్మె
ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే చండశాసనుడైన ఎన్టీ రామారావుకే చెమటలు పట్టించిన ఘనత ఉద్యోగులకు ఉంది. ప్రభుత్వోద్యోగులు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాగే పీఆర్సీ విషయమై 1986 లో ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. యాభై మూడు రోజుల పాటు నిరవధిక సమ్మె చేశారు.చివరకు ఎన్టీఆరే దిగిరావాల్సి వచ్చింది.
దీంతో ఇప్పుడు మరోసారి ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎదురయ్యే పరిస్ధితులపై ప్రభుత్వమే కాదు ఎవరూ అంచనా వేయలేని పరిస్ధితులు ఉండబోతున్నాయి. అసలే రోజువారీ ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంలో ఉద్యోగుల సమ్మె జరిగితే మాత్రం తీవ్ర ప్రభావం పడబోతోంది.
ఎన్టీఆర్ హయాంలో జరిగిందిదీ
1986 జులైలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. ఇందులో మూడు అంశాలపై మాత్రం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్త పీఆర్సీని ఆ ఏడాది జులై నుంచి కాకుండా జనవరి నుంచి అమలు చేయాలని, కనీస మూలవేతనాన్ని 740 నుంచి 750 రూపాయలు అంటే కేవలం పది రూపాయలు పెంచాలని, అప్పటివరకూ ఇచ్చిన మధ్యంతర భృతిని మూలవేతనంలో కలపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కానీ ఎన్టీఆర్ ససేమిరా అన్నారు. ఆనాటి రాష్ట్ర ఆదాయంలో 48శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతున్నాయని,ఇక పెంచే అవకాశమే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు.
ఇదే విషయాన్ని వార్తాపత్రికల్లోనూ ప్రముఖంగా ప్రకటనల రూపంలో ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు 1986 నవంబర్ 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. దీంతో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు మూతపడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పాలన దాదాపు స్తంభించింది.
వెనక్కి తగ్గని ఉద్యోగులు
రాష్ట్రంలో సమ్మె ప్రారంభమైన కొద్ది రోజులకు ఎన్టీఆర్ కాస్త దిగివచ్చి ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. కానీ ప్రభుత్వోద్యోగులు దాన్నీ తోసిపుచ్చారు. సీఎంతో కాకుండా ఇతరులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అంతే కాదు తమ సమ్మెను ఉధృతం చేశారు. పరిస్థితులు ప్రభుత్వం చేజారి పోయే విధంగా తయారవడంతో ఎన్టీఆర్ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశారు. ముఖ్యమంత్రిగా తన అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నిర్వాహకులైన 12 మంది నాయకులను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయించారు.
దీంతో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారైంది. ఉద్యోగులు ఇంకా రెచ్చిపోయారు. రాస్తారోకోలు, రాష్ట్ర బంద్ నిర్వహించడంతో శాంతిభద్రతలకు భంగం కలిగే వాతావరణం నెలకొంది. దీంతో అహం దెబ్బతిన్న ఎన్టీఆర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ డిస్మిస్ చేస్తానని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పీటముడి మరింత బిగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కడా తగ్గకుండా సమ్మె కొనసాగించారు.
ఎన్టీఆర్ ఉసురు తీసిన సమ్మె
ఎన్టీఆర్, ఉద్యోగులు ఇద్దరూ తగ్గకపోవడంతో పీటముడి కొనసాగింది. చివరికి కమ్యూనిస్ట్ ఎంపీ సుకుమార్ సేన్ ఎన్టీఆర్ ను ఆదుకున్నారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు అయిన సుకుమార్ సేన్ రాష్ట్రానికి వచ్చి ఎన్టీఆర్ కు, ప్రభుత్వోద్యోగులకు మధ్య రాయబారం నెరిపారు. సామరస్యపూరిత వాతావరణం నెలకొల్పారు. అటు ఎన్టీఆర్, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన నచ్చచెప్పారు.
సుకుమార్ సేన్ మధ్యవర్తిత్వం ఫలించి యాభై మూడు రోజుల ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు తెరపడింది. అయితే అంతిమ విజయం ప్రభుత్వ ఉద్యోగులదే అయింది. అనూహ్యంగా తరువాత జరిగిన 1989 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. ఇప్పుడు జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే పయనిస్తారా లేక ఓ అడుగు వెనక్కి తగ్గి సమస్యకు సామరస్య ముగింపు పలుకుతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.