పీఆర్సీ జీవోల్ని ఆమోదించిన ఏపీ కేబినెట్-ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి ఉద్యోగులు-కార్యాచరణ ప్రకటన
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగుల పోరు సమ్మెకు దారి తీస్తోంది. పీఆర్సీ జీవోలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు వచ్చే నెల 7 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అమరావతి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్.. పీఆర్సీ జీవోలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో ఉద్యోగుల అభ్యంతరాల్ని పక్కనబెట్టినట్లయింది.
పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం
ఏపీలో ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పీఆర్సీ జీవోలకు ఇవాళ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ప్రభుత్వం మాత్రం ఈ జీవోలకు ఆమోదముద్ర వేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది. ఉద్యోగుల అభ్యంతరాల్ని లెక్కచేయకుండా ఈ జీవోలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంపై సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.
భగ్గుమన్న ఉద్యోగులు
ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న పీఆర్సీ జీవోలకు ఆమోదముద్ర వేస్తూ తీసుకున్న నిర్ణయంపై భగ్గుమన్నారు. విజయవాడలోని ఏపీఎన్జీవో భవన్ లో సమావేశమైన ఉద్యోగులు.. ఈ జీవోలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన నిర్ణయం తెలియగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. దీంతో తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు. ఇందులో నాలుగు ఉద్యోగసంఘాల జేఏసీలు ఏకమై పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి పోరు కొనసాగించాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి
ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా పీఆర్సీ జీవోల్ని విడుదల చేయడంతో పాటు వాటిని కేబినెట్ లో ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగసంఘాలు.. దీనికి నిరసనగా వచ్చే నెల నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం సీఎస్ సమీర్ శర్మను కలిసి సమ్మె నోటీసు అందజేయాలని నాలుగు ఉద్యోగ సంఘాల జేఏసీలతో కూడిన పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. దీంతో ఈ మేరకు క్షేత్రస్దాయిలో ఉద్యోగుల్ని సమాయత్తం చేసే పనిలో సంఘాలు నిమగ్నమయ్యాయి.
ఉద్యోగుల కార్యాచరణ ఇదే
సోమవారం సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఉద్యోగసంఘాలు... ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అలాగే ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు చేపట్టనున్నారు. అనంతరం 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాల సమర్పించాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి 30 వరకూ జిల్లాల్లో నిరాహారదీక్షలు చేపట్టాలని ఉద్యోగసంఘాలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 3న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులతో ఛలో విజయవాడ చేపట్టనున్నారు. అలాగే ఫిబ్రవరి 5 నుంచి ప్రభుత్వానికి సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించారు. అంతిమంగా ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు.