జీపీఎఫ్ సొమ్ము మాయం-సీఎంవో చుట్టూ ఉద్యోగ నేతల చక్కర్లు-పిట్టకథలంటూ సర్కార్ పై ఫైర్
ఏపీలో తాజాగా లక్షలాది మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల రూపాయల మొత్తం ఉపసంహరించారు. ఈ మేర ఉద్యోగులకు డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ డబ్బుల్ని ప్రభుత్వమే విత్ డ్రా చేసిందా లేక ఏదైనా జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఉద్యోగసంఘాల నేతల ద్వారా వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు రోజులుగా జీపీఎఫ్ డబ్బుల మాయంపై ఉద్యోగసంఘాల నేతలు సచివాలయం చుట్టూ, ఆర్ధిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే వారికి ఒక్కోసారి ఒక్కోలా వారు వివరణ ఇస్తున్నారు. ఓసారి సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగందని, మరోసారి ఏం జరిగిందో ఏజీ కార్యాలయాన్ని అడిగి తెలుసుకుంటామంటూ చెప్తున్నారు. దీంతో ఉద్యోగ నేతల్లో కూడా టెన్షన్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వపారు ఇవాళ మరోసారి సీఎస్ సమీర్ శర్మతో భేటీ అయ్యారు. ఏం జరిగిందో చెప్పాలని కోరారు. అయితే ఆయన వద్ద కూడా నిర్దిష్ట సమాధానం లేకపోవడంతో ఉద్యోగసంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే ఉద్యోగులకు తెలియకుండా వారి జీపీఎఫ్ ఖాతాల డబ్బు విత్ డ్రా చేయడం క్రిమినల్ చర్యగా పేర్కొంటున్న ఉద్యోగసంఘాల నేతలు.. ఇవాళ సీఎస్ తో భేటీ తర్వాత కూడా క్లారిటీ రాకపోవడం.తో ప్రభుత్వంపై మండిపడ్డారు. సాంకేతిక కారణాలతో డబ్బు విత్ డ్రా అయినట్లు ప్రభుత్వం ఇస్తున్న వివరణతో తాము సంతృప్తి చెందడం లేదని ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు.
ఉధ్యోగుల ఖాతాల్లో నుంచి నగదు డెబిట్ అయిన వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. ఈ వాజ్యంలో సీఎస్ తో పాటు ఆర్దికశాఖ ఉద్యోగులు, సీఎఫ్ఎంఎస్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ను ప్రతివాదులుగా చేరుస్తామని హెచ్చరించారు.